మోడీపై రాహుల్ గాంధీ ఫస్ట్ టైం! మీ ప్రధాని కాదు.. దేశ ప్రధాని
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలల పాటు సెలవుల్లో ఉన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నాడు తొలిసారి సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గోదుమల పైన మద్దతు ధర రూ.10 మాత్రమే పెంచారన్నారు. రైతులు ఆనందంగా ఉంటేనే దేశానికి శ్రేయస్కరం అని చెప్పారు. యూపీఏ హయాంలో వ్యవసాయం వృద్ధి రేటు 4.2 శాతంగా ఉందని, అదే సమయంలో దేశం వెలిగిపోతోందంటూ ప్రచారం చేసుకున్న గత ఎన్డీయే హయాంలో 2.6 శాతంగా మాత్రమే ఉందన్నారు.
మార్కెట్లో కుప్పలుతెప్పలుగా పడిపోయి ఉన్న ధాన్యం రాశులను ప్రధాని ఎందుకు పరిశీలించరని ప్రశ్నించారు. ఇది పేదల ప్రభుత్వం కాదని, కార్పోరేట్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఇది సూటూ, బూట్ల ప్రభుత్వమని, సామాన్యులది కాదన్నారు. రాహుల్ మాట్లాడే సమయంలో అధికార పార్టీ సభ్యులు పదేపదే నినాదాలు చేస్తుండటంతో... నిజం నిష్ఠూరంగా ఉంటుందని, కాస్త వినాలన్నారు.
మీ ప్రధాని కాదు.. దేశ ప్రధాని..
రాహుల్ తన ప్రసంగం సమయంలో మీ ప్రధాని మీ ప్రధాని అంటూ వ్యాఖ్యానించారు. దీనిని బీజేపీ నేతలు తప్పుపట్టారు. దీంతో, మీ ప్రధాని కాదు దేశ ప్రధాని అంటూ సవరించుకున్నారు.
అందరికీ మాట్లాడే అవకాశం, చర్చిద్దాం: వెంకయ్య
రైతుల బాధలు, ఆవేదన విషయంలో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. భూసేకరణ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనదని, దీనిపై అందరికీ మాట్లాడేందుకు అవకాశముంటుందని, సావధానంగా వినాలన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలు రైతులు, వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల దేశంలోని ఏడు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వడగళ్ల వానల వల్ల తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో రైతుకు నష్టం జరిగిందన్నారు. ఇది తెలియగానే ప్రధాని మోడీ కేంద్రమంత్రులను పిలిచి ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని చెప్పాలన్నారు.
తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత త్వరగా స్పందించిన ప్రధాని లేరన్నారు. కేంద్రమంత్రులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారని చెప్పారు. ఈ దేశంలో అధికారి కొడుకు అధికారి కావాలని, వైద్యుడి కొడుకు వైద్యుడు కావాలని కోరుకుంటారని, కానీ ఒక్క రైతు మాత్రమే అలా కోరుకోడన్నారు.
గతంలో 50 శాతం నష్టం జరిగితేనే పంట నష్ట పరిహారం ఉండేదని, తాము మాత్రం పరిస్థితిని సమీక్షించి 33 శాతం నష్టం జరిగినా పరిహారం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
తాను స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో కలిసి పర్యటించానని చెప్పారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలే నష్టం పైన కేంద్రానికి ఉత్తరాలు రాస్తాయని, ఆ తర్వాత కేంద్రం నిపుణుల బృందాన్ని పంపిస్తుందని చెప్పారు. తాము మాత్రం వెంటనే స్పందించామన్నారు.
రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చి కేవలం పది నెలలే అయిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం యాభై ఏళ్లకు పైగా అధికారంలో ఉందని చెప్పారు. మా ప్రభుత్వం పేదల కోసం, గ్రామీణ ప్రజల కోసం ఆలోచిస్తోందన్నారు.
వలసలు ఆపడం, గ్రామీణ ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఎన్నో ఆర్డినెన్స్ తీసుకు వచ్చి, ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. ప్రతిపక్షం మంచి సూచనలు ఇస్తే తాము తీసుకుంటామన్నారు.
వర్షాధార ప్రాంతాల్లో రూ.6వేలు ఉన్న నష్ట పరిహారాన్ని తాము రూ.13వేలకు పెంచామని, అలాగే లక్ష రూపాయల నుండి లక్షన్నరకు పెంచామని చెప్పారు. చిన్న పరిశ్రమలకు, చేతి వృత్తుల కోసం ముద్ర బ్యాంకును ప్రారంభించామని చెప్పారు.