నేను మాట్లాడితే భూకంపమే.. : రాహుల్ గాంధీ హెచ్చరిక!
పార్లమెంటులో తనను మాట్లాడనిస్తే భూకంపం రావడం ఖాయమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పదునైన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: శుక్రవారం నాడు పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అధికార పక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించిన రాహుల్.. తాను పార్లమెంట్లో మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు.
ప్రతిపక్షాలకు భయపడే ప్రధాని పార్లమెంట్ లో అడుగుపెట్టడం లేదని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దుపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని, ప్రభుత్వం దీనిపై చర్చకు రావాలని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను సభలో ఎండగట్టి తీరుతామని చెప్పారు.
దేశమంతా ప్రసంగాలు ఇచ్చే మోడీ.. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరుకావాలని మాట్లాడుతున్నారని పార్లమెంటులో మాట్లాడటానికి మాత్రం భయపడుతున్నారని విమర్శించారు. అధికార పక్షం చర్చకు ఒప్పుకుంటే.. డిమానిటైజేషన్ అంటే ఏమిటి? దాని వల్ల ఎవరికి లాభం? నోట్లను ఎందుకు రద్దు చేశారు? వంటి ప్రశ్నలపై తాను మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు.
చర్చ జరిగితే.. నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణం అన్న సంగతి బయటపడుతుందని రాహుల్ చెప్పారు. కానీ సభలో తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నారని.. తనను మాట్లాడనిస్తే భూకంపం రావడం ఖాయమని పదునైన వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల నుంచీ నోట్ల రద్దుపై చర్చ జరగాలని తాము పట్టుబడుతున్నామని ఈ సందర్బంగా రాహుల్ గుర్తు చేశారు.