రైతుల ఆత్మహత్యలు, రాహుల్ గాంధీ పర్యటన
మండ్య: ఆర్థిక సమస్యలు, పంటలు నష్టపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ సిద్దం అయ్యారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ మొదటి వారంలో కర్ణాటకలోని మండ్య జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇప్పటికే మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వడంతో మండ్యలో రాహుల్ గాంధీ పర్యటనకు ఎర్పాట్లు చకచక చేస్తున్నారు.
ఆర్థిక సమస్యల కారణంగా ఒక మండ్య జిల్లాలోనే గత రెండు నెలల నుండి ఇప్పటి వరకు 47 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీ.కే. హరిప్రసాద్ తదితరులు మండ్య జిల్లా చేరుకుని ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు సేకరించారు.
జులైలో రాహుల్ గాంధీ మండ్య జిల్లాలో పర్యటిస్తారని బీ.కే. హరిప్రసాద్ అప్పట్లో చెప్పారు. అయితే బీబీఎంపీ ఎన్నికలు రావడంతో రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనను ఖరారు చేశారు.
రాహుల్ గాంధీ మండ్య జిల్లాలో పాదయాత్ర చెయ్యడానికి నాలుగు మార్గాలు గుర్తించారు. పలు గ్రామాలలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని, అలాగే రోడ్ షో ఎర్పాటు చేశామని మండ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సత్యానంద్ తెలిపారు.