రాహుల్ గాంధీ వల్లే నేపాల్ భూకంపం: సాక్షిమహారాజ్ వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ మరోసారి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపాల్లో పెను భూకంపానికి, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కేదార్నాథ్ పర్యటనకు లంకె పెట్టారు. నేపాల్లోని ఘోర భూకంపంలో నాలుగువేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.
ఎంపీ సాక్షి మహారాజ్ హరిద్వార్లో విలేకరులతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ గొడ్డు మాంసం తిని, ఆ తర్వాత తనను తాను శుద్ధీకరణ చేసుకోకుండానే కేదార్నాథ్ ఆలయానికి వెళ్లాడని ఆరోపించారు. అందుకే, నేపాల్లో భూకంపం వచ్చిందని ధ్వజమెత్తారు. ఆ సమయంలో విశ్వహిందూ పరిషత్కు చెందిన సాధ్వి ప్రాచీ కూడా అక్కడే ఉన్నారని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు నిత్యం కాంట్రోవర్సీ వ్యాఖ్యలు చేస్తున్న తమ పార్టీ ఎంపీలకు క్లాస్ పీకుతున్నారు. అయినప్పటికీ వారు తగ్గకపోతుండటం గమనార్హం. మోడీ, షాలు ఎన్నోసార్లు వారిని హెచ్చరించారు. అయినప్పటికీ వారు తమ వ్యాఖ్యల ద్వారా బీజేపీని చిక్కుల్లో పడేశారు.
సాక్షి మహారాజ్ తాజా వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు నీచ రాజకీయాలు చేస్తున్నారని, దగ్గర ఉండి వారిని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణం సాక్షి మహారాజ్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అయితే సాక్షి పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్ అన్నారు.