సినీ బుల్లెట్ల్ కావు, సల్మాన్ ఓ ట్యూబ్లైట్: రాజ్ నిప్పులు
ముంబై: పాకిస్తాన్ కళాకారులకు మద్దతుగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే నిప్పులు చెరిగారు.పాక్ నటులు ఉగ్రవాదులు కారని, వారు వర్క్ పర్మిట్ వీసా తీసుకునే ఇక్కడకు వచ్చారని సల్మాన్ శుక్రవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
సల్మాన్ మెదడు అప్పుడప్పుడూ ట్యూబ్లైట్లాగా పనిచేస్తుందని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. దేశాన్ని, ప్రజలను కాపాడే క్రమంలోనే సైనికులు ప్రాణాలు విడిచారని, వారికి వ్యక్తిగతంగా పాక్తో ఎలాంటి వైరమూ లేదుని, వారు ఎదుర్కొన్న బుల్లెట్లు సినిమాల్లో చూపించినట్టు నకిలీవి కావని అన్నారు.
భారత సైనికులు చేసేవి సినిమాలో సల్మాన్ ఖాన్లా అవాస్తవ పోరాటాలు కాదని, వారంతా ఆయుధాలు పక్కనపెట్టి గులామ్ అలీ సంగీత కచేరీకి వస్తానంటే ఏమి చేస్తావని ఆయన సల్మాన్ ఖాన్ను ప్రశ్నించారు. మొదట పాక్ ఆర్టిస్టుల వద్దకు వెళ్లి ఉరీ ఉగ్రదాడిని ఖండించాలని కోరామని, వారు అందుకు అంగీకరించకపోవడంతోనే 48 గంటల్లో దేశాన్ని వదిలి పోవాలని హెచ్చరించామని ఆయన తెలిపారు.
పాకిస్థాన్ ప్రజలు చాలా మంచివారని తాను గతంలో కూడా చెప్పానని వారితో మనకెలాంటి సమస్యా లేదు గానీ అక్కణ్నుంచి ఉగ్రవాదులుగా మనముందుకు వస్తున్న వారితోనే సమస్య అని రాజ్ థాకరే అన్నారు. అయినా వందకోట్ల ప్రజలున్న ఈ దేశంలో టాలెంట్ ఉన్న నటులే దొరకనట్టు, పక్క దేశం వారిని ప్రోత్సహించడమేమిటని ఆయన అడిగారు.