ఎపికి తక్కువ నిధులా, హోదాపై ఆలోచిస్తాం: రాజ్నాథ్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ నిధులు అనే ప్రశ్నకు అవకాశమే లేదని కేంద్ర కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రాజ్నాథ్ నివాసంలో శుక్రవారం హోలీ పండుగ అత్యంత సందడిగా జరిగింది. బీజేపీ నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజ్నాథ్ నివాసంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు తక్కువగా ఉన్నాయి కదా అని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, అలాంటి ప్రశ్నకు ఆస్కారమే లేదని చెప్పారు. కేంద్ర పన్నుల్లో ప్రత్యక్ష వాటాగా రాష్ట్రాలకు చాలా ఎక్కువ భాగం లభిస్తోందని, స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత ఎక్కువ భాగం నిధులు(42శాతం) రాష్ట్రాలకు మంజూరు కావటం ఇదే తొలిసారి అని తెలిపారు.
ప్రత్యేక హోదా సంగతేంటి? అని ప్రశ్నించగా.. ఇలాంటి సమస్యలన్నింటిపైనా తాము సమీక్షిస్తామని, తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఆ విధంగా ఉన్నారు. ప్రత్యేక హోదా కల్పించడానికి ఇతర రాష్ట్రాలు ఆటంకంగా ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఈ స్థితిలో ఎపికి ప్రత్యేక హోదా లభించే అవకాశం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
నాగాలాండ్ రాష్ట్రంలోని దీమాపూర్లో అత్యాచారం కేసు నిందితుడిని ప్రజలు జైల్లోంచి లాక్కుని వచ్చి, కొట్టి చంపిన సంఘటనపై రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆ సంఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ సంఘటనకు ప్రేరేపించినవారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్కడ తగిన భద్రత కల్పించామని అన్నారు.