టాయ్లెట్ ఏక్ తలాక్ కథ: భార్యకు అది టార్చరే.. అందుకే విడాకులు
దీన్ని క్రూరత్వం కింద పరిగణించిన కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
జైపూర్: 'టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథా' అంటూ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమా సందడి చేస్తోంది. ఈ సినిమా తెరపై ఉండగానే.. 'టాయ్లెట్ ఏక్ తలాక్ కథ' గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. టాయ్ లెట్ కారణంగా ఓ గృహిణికి కోర్టు విడాకులు మంజూరు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్ లోని బిలావర జిల్లా అటున్ గ్రామానికి చెందిన వ్యక్తితో 2011లో ఓ యువతికి వివాహం జరిగింది. పెళ్లయి అత్తింట్లో అడుగుపెట్టాక.. అక్కడ టాయ్ లెట్ లేకపోవడం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైంది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించాలని, ఆరు బయటకు వెళ్లడం కష్టంగా ఉందని భర్తతో చాలాసార్లు చెప్పింది.
ఇంటి ఆడపడుచులపై కూడా ఈ విషయమై ఒత్తిడి తెచ్చినా ఎటువంటి లాభం లేకుండా పోయింది. పైగా దాని గురించి మాట్లాడితే భర్త చీటికీ మాటికి ఆమెను కొట్టేవాడు.దీంతో ఇక అక్కడ ఉండటం తనవల్ల కాదంటూ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి రెండేళ్లు గడిచినా.. భర్త మాత్రం టాయ్ లెట్ కట్టించలేదు.
భర్త తీరుతో ఓపిక నశించిన భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. 'మన ఇంట్లో మహిళలకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఎలా ఉంటుంది?, వారిని బహిరంగ మలవిసర్జనకు ప్రోత్సహించటం సరైందేనా?.. చీకటి పడేంతవరకు వారు ఆ బాధను అనుచుకుని మరీ బయటకు వెళ్తున్న సంగతి తెలియదా?, విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాళ్లకు ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని తెలియదా?'
' ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఆ మహిళ అనుభవించింది ముమ్మాటికీ మానసిక వేదనే కాబట్టి దీన్ని క్రూరత్వం కింద పరిగణించి ఆమెకు విడాకులు మంజూరు చేస్తున్నాం' అని న్యాయమూర్తి శర్మ తీర్పు వెలువరించారు.