మోడీపై మండిపోతున్న రజినీకాంత్: అందుకే పార్టీ?
మోడీ తీరుపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
చెన్నై: జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు తీవ్రమైన సంక్షోభానికి దారి తీశాయి. ఆ సంక్షోభం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కూడా లేదు. తన వ్యతిరేకవర్గాన్ని దెబ్బ కొట్టి అధికారం చేజిక్కించుకునే సమయంలో జయలలిత ప్రియసఖి శశికళ జైలు పాలయ్యారు. దాంతో ఆమె పళనిసామికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి వెనక నుంచి తమిళ రాజకీయాలను నడిపించాలని చూశారు.
అయితే, శశికళకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం శశికళకు ఎదురు తిరగడం వెనక కూడా బిజెపి పాత్ర, ముఖ్యంగా బిజెపి జాతీయ స్థాయి నాయకత్వం పాత్ర, ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి.
పళనిసామి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తమిళ రాజకీయాలు కొలిక్కి రాలేదు. పన్నీర్ సెల్వం, పళనిసామి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నంలో మరింత సంక్షోభంలో తమిళనాడు కూరుకుపోయింది. ఇప్పటికీ ఆ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.
రజనీకాంత్ ఆగ్రహం ఇదీ...
జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో మోడీయే అగ్గి రాజేశారనే అభిప్రాయంతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తమిళనాడులో అనిశ్చిత స్థితి కొనసాగడానికి బిజెపియే కారణమని అంటున్నారు. పళనిసామితో రాజీకి సిద్ధపడుతూ, పళనిసామిని గద్దె దించడం ద్వారా శశికళ వర్గాన్ని రాజకీయాలకు దూరం చేయాలనే వ్యూహంలో భాగంగానే మోడీ పన్నీర్ సెల్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.
అందుకే రాజకీయాల్లోకి...
తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతున్న స్థితిలో ప్రజలందరినీ ఏకం చేసి, సంక్షోభాన్ని తొలగించడానికి తన ఇమేజ్ పనికి వస్తుందని రజనీకాంత్ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో తీవ్రమైన సంక్షోభం నెలకొన్న స్థితిలో తాను రాజకీయ పార్టీ పెడితే ఫలితం ఉంటుందనే అంచనాకు కూడా ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. తద్వారా బిజెపి ప్రయత్నాలను తిప్పికొట్టవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. మోడీపై ఆగ్రహంతోనే ఆయన పార్టీ పెట్టడానికి సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.
జయలలిత
జయలలిత మరణం తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు, రాజకీయ నాయకులపై ఐటి శాఖ దాడులు... ఇవన్నీ మోడీ ప్రమేయంతోనే జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో రజనీకాంత్ గంటల తరబడి చర్చలు సాగించారని అంటున్నారు. రజనీకాంత్ చిదంబరంతో చర్చలు జరిగిన విషయాన్ని గమనించిన బిజెపి తన అస్త్రాన్ని వెలికి తీసినట్లు భావిస్తున్నారు. తెల్లారే సరికి చిదంబరం కుటుంబ సభ్యులపై ఐటి దాడులు జరిగాయి. ఆయన కుమారుడు కార్తిపై కేసు కూడా నమోదైంది.
రజనీకాంత్ ఆగ్రహం అదే...
చిదంబరం కుటుంబ సభ్యులపై వరుస ఐటి దాడులు జరిగిన తీరు పట్ల రజనీకాంత్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే రాజకీయ పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని రజనీకాంత్ కొట్టిపారేశారు. మీడియాలో వచ్చిన ఊహాగానాలు నిజం కావని ఆయన చెప్పారు. వాటిని తాను పట్టించుకునే స్థితిలో లేనని స్పష్టం చేశారు. అయితే, నిజంగానే రజనీకాంత్ మోడీపై ఆగ్రహంగా ఉన్నారా లేదా అనేది తేలాల్సి ఉంది.
అందుకే ఇలా...
రజనీకాంత్ డిఎంకె నేత స్టాలిన్ను ప్రశంసించడాన్ని బిజెపి సహించలేకపోతోంది. అందుకే ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని రజనీకాంత్ ఎందుకు ప్రశంసించలేదని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో బిజెపి పార్లమెటు సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వరుసగా రజనీకాంత్పై విమర్సలు ఎక్కుపెడుతున్నారు. తమిళ సెంటిమెంట్ ద్వారా రజినీకాంత్ను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దాంతో రజనీకాంత్ తాను పక్కా లోకల్ అని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద, రజినీకాంత్ వ్యవహారం బిజెపికి నచ్చడం లేదని స్పష్టంగానే తెలిసిపోతోంది.
శత్రువులు లేరు...
నిజానికి రజినీకాంత్కు శత్రువులు లేరు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ ఆయన చాలా కాలంగా సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రజనీకాంత్తో భేటీ అయిన సందర్భం కూడా ఉంది. అయితే, రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులే కాదు, శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. దాన్ని రజనీకాంత్ ఎలా తట్టుకుంటారనేది ప్రశ్న.