తీవ్ర నిరసనలతో వెనక్కి తగ్గిన రజినీ: శ్రీలంక పర్యటన రద్దు
తమిళ సంఘాల నిరసనల నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వెనక్కి తగ్గారు. వచ్చే నెలలో శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 9, 10 తేదీల్లో శ్రీలంకలో పర్యటించాలనుకున్న రజనీ..
చెన్నై: తమిళ సంఘాల నిరసనల నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వెనక్కి తగ్గారు. వచ్చే నెలలో శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 9, 10 తేదీల్లో శ్రీలంకలో పర్యటించాలనుకున్న రజనీ.. తమిళనాడులో రాజకీయ పార్టీలు, సంఘాల ఆందోళనల దృష్ట్యా తన పర్యటనను రద్దుచేసుకున్నట్లు ప్రకటించారు.
రజినీ! ఆ దేశానికి వెళ్లొద్దు: తమిళనాట పెరుగుతున్న నిరసనలు
రోబో 2.0 చిత్ర నిర్మాణ సంస్థ లైకా.. శ్రీలంకలో నిర్మించిన 150 గృహాల ప్రారంభోత్సవానికి రజనీకాంత్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా, శ్రీలంకకు వెళ్లవద్దని తమిళ రాజకీయ పార్టీలు, సంఘాలు తీవ్ర నిరసనలు చేపట్టాయి. తమిళులను అణచివేసిన రాజపక్సే కుటుంబంతో లైకా సంస్థకు సంబంధాలు ఉన్నాయని తమిళ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా రావాల్సిందిగా లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగమ్.. రజనీనని ఆహ్వానించారు. అందుకు ఆయన ఒప్పుకొన్నారని శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకను, అక్కడి తమిళిలను చూడాలని తనకుందని ప్రకటించారు. అయితే, తమిళ రాజకీయ పార్టీలు, సంఘాలు మాత్రం శ్రీలంకకు వెళ్లకూడదని ఆందోళన చేశాయి. దీంతో రజినీ తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారు.