రండి తలైవా: రజినీ కోసం సొంతగ్రామం ప్రజల ఎదురుచూపులు
కృష్ణగిరి జిల్లాలోని తన స్వగ్రామానికి ఎప్పుడు వస్తారాని గ్రామస్థులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని వేప్పనపళ్లి తాలూకాలోని ఈ గ్రామం పేరు నాచ్చికుప్పం.
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సొంత గ్రామం వెలుగులోకి వచ్చింది. తాను ఎక్కడినుంచి వచ్చినా తాను పక్కా తమిళుడినేనని రజినీకాంత్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఎదురుచూపులు..
కాగా, కృష్ణగిరి జిల్లాలోని తన స్వగ్రామానికి రజినీకాంత్ ఎప్పుడు వస్తారాని ఆ గ్రామస్థులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని వేప్పనపళ్లి తాలూకాలోని ఈ గ్రామం పేరు నాచ్చికుప్పం. సుమారు 500 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి.
తన స్వగ్రామమన్న రజినీ..
తన తల్లిదండ్రుల స్వగ్రామం నాచ్చికుప్పమని రజనీకాంత్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన పూర్వీకులు ఇక్కడే ఏళ్ల తరబడి జీవించారు. రజనీకాంత్ తండ్రి రాణేజిరావ్ ఈ గ్రామంలోనే జన్మించారని తెలిసింది.
కర్ణాటకకు వలస
రజినీ తండ్రి ఉద్యోగం కోసం కర్ణాటకలోని కనకపుర తాలూకా సోమనహళ్లి గ్రామానికి వలస వెళ్లారు. అక్కడే రామాబాయ్ని వివాహం చేసుకున్నారని తెలిసింది. వారికి సత్యనారాయణన్, యశ్వంత్రావ్, శివాజీరావ్, ఆశ్వతమ్మాళ్ అనే నలుగురు పిల్లలు పుట్టారు. వారిలో శివాజీరావ్ కండక్టర్గా విధుల నిర్వమించి ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి రజనీకాంత్గా పేరు మార్చుకున్నారు.
తల్లిదండ్రుల స్మారకం
కాగా, నాచ్చికుప్పం గ్రామంలో ఉన్న రజనీకాంత్ పూర్వీకులు మరణించిన తర్వాత గత 40 ఏళ్లగా వారి ఇళ్లు శిధిలావస్థకు చేరాయి. గతంలో రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణన్ తన పూర్వీకుల ఇంటికి సమీపంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో తల్లిదండ్రుల స్మారకార్థం తాగునీటి తొట్టెలు నిర్మించారు.
ఇప్పటికైనా రండి...
ఆ ప్రాంతంలో పాఠశాలను, కల్యాణ మండపాన్ని కూడా నిర్మించనున్నట్లు రజినీ సోదరుడు సత్యనారాయణన్ గతంలో ప్రకటించారు. కానీ కరవు ప్రాంతం కావడంతో, నీటి వసతి లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయని తెలిసింది. ఇప్పటికైనా ఒకసారి రజినీకాంత్ తన స్వగ్రామం నాచ్చికుప్పంకు రావాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు.