ఆర్కే నగర్ హీట్: మరో కోణం, 'రజనీకాంత్'తో బీజేపీ 'గేమ్'
ఆర్కే నగర్ బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ సూపర్ స్టార్ రజనీకాంత్కు కలవడం రాజకీయ వర్గాల్లో, బయట చర్చకు దారి తీసింది. వీరిద్దరి కలయికకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
చెన్నై: ఆర్కే నగర్ బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ సూపర్ స్టార్ రజనీకాంత్కు కలవడం రాజకీయ వర్గాల్లో, బయట చర్చకు దారి తీసింది. వీరిద్దరి కలయికకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
తమిళనాట రాజకీయ నాయకులకు, పార్టీలకు రజనీకాంత్ ఎప్పుడూ హాట్ టాపికే. ఆయన రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడకపోయినా.. బయట ఊహాగానాలు మాత్రం చెలరేగుతాయి. ఏ ఎన్నికలు జరిగినా, ఎప్పుడూ ఇదే కనిపిస్తోంది.
నిన్న మోడీ: బీజేపీ కొత్త ట్విస్ట్... రజనీకాంత్ను కల్సిన ఆర్కే నగర్ అభ్యర్థి
ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికల హాట్ హాట్గా మారింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సూపర్ స్టార్ను కలవడంతో అది మరింత హాట్గా మారింది. తనకు రజనీకాంత్ మద్దతు ఉందని అమరన్ చెప్పగా, ఆ తర్వాత రజనీ దానిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరికీ మద్దతివ్వడం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు.
మొత్తంగా ఓ వైపు రజనీని తమ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఆయన ఇమేజ్ను ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నాడు మోడీ, నేడు గంగై అమరన్ కలవడమే అందుకు నిదర్శనం అంటున్నారు. జయ మృతి తర్వాత కూడా బీజేపీ రజనీ కోసం తనవంతు ప్రయత్నాలు చేసింది.
అలా చెప్పినప్పటికీ..
ఇక, గంగై అమరన్ కలిసినప్పుడు రజనీకాంత్ ఆయన గెలుపును కోరుకున్నారని ప్రచారం జరిగింది. ఆయన సినిమా వ్యక్తి కాబట్టి రజనీని కలిశారు. అలా కలిసినప్పుడు రజనీ నిజంగానే అలా చెప్పారా అనేది తెలియాలి. ఒకవేళ గెలవాలని కోరుకున్నప్పటికీ.. ఎవరైనా కలిస్తే అలా కోరుకోవడం సహజమే అంటున్నారు.
గత 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బేగంపేట విమానాశ్రయంలో లోక్సత్తా అధినేత జేపీ నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిశారు. జేపీ అప్పుడు మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
టిడిపి - బిజెపి అప్పుడు కలిసి పోటీ చేశాయి. బీజేపీ మద్దతుతో టిడిపి అభ్యర్థి బరిలో నిలిచారు. అలాంటి సమయంలోను.. తనను కలిసిన జేపీతో మీలాంటి వారు పార్లమెంటులో అడుగు పెట్టాలని మోడీ అన్నారు.
బీజేపీ ప్రయత్నాలు.. మరో యాంగిల్
తమ పార్టీలో చేరాలని బీజేపీ ఎప్పటి నుంచో రజనీకాంత్ను కోరుతోంది. కానీ ఆయన మౌనంగా ఉంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే రాజకీయాలపై ఆసక్తి లేని ఏమీ మాట్లాడటం లేదు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కలిసినా.. ఆయన మద్దతుగా మాత్రం మాట్లాడలేదు. ఆ తర్వాత తామిద్దరిది సాధారణ కలయిక మాత్రమేనని ఇరువురు ప్రకటించారు.
ఇప్పుడు 69 ఏళ్ల బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ కలిసి రజనీకాంత్ మద్దతు కోరారు. సూపర్ స్టార్ ఆయనకు మద్దతు పలికినట్లుగా ఆయన చెప్పుకున్నారు. అయితే, దీని వెనుక మరో కోణం ఉందని అంటున్నారు. గంగై అమరన్ సినిమా ప్రముఖులు. ఆయన సంగీత దర్శకులు, గేయ రచయిత, దర్శకుడు. ఇళయరాజా సోదరుడు. 50కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. పలు చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. దీంతో రజనీని కలిసేందుకు ఆయనకు సులభంగా అవకాశం దక్కింది. దీంతో రజనీ మద్దతు లభించినట్లుగా ప్రచారం జరిగింది.
సూపర్ స్టార్ ఎప్పుడూ హాటే
రజనీకాంత్ను కలవడం ద్వారా రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. ఇందులో భాగంగానే బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ కలిశారని చెప్పవచ్చు. మొత్తానికి రజనీని బీజేపీ అభ్యర్థి కలవడం తమిళనాట కూడా బాగా చర్చనీయాంగా మారింది.
ఇటీవల కొద్ది రోజుల క్రితం.. ఆయన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పవర్ (మనలోని పవర్) గురించి మాట్లాడితే దానిని రాజకీయాలకు ఆపాదించారు. ఆయన మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఎవరైనా వచ్చి కలిసినా అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
తొలి ప్రకటన.. జయకు వ్యతిరేకంగా
రజనీకాంత్ తొలిసారి 1996లో రాజకీయ అంశంపై ప్రకటన చేశారు. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే తమిళనాడును ఆ దేవుడు కూడా రక్షించలేడని వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ఘోర పరాజయం చవి చూసింది. 2004 ఎన్నికల సమయంలో మాత్రం అన్నాడీఎంకే - బీజేపీ కూటమికి కితాబిచ్చారు.
ఆ తర్వాత ఆయన రాజకీయపరమైన ప్రకటనలు ఇచ్చిన సందర్భాలు లేవు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ.. రజనీని కలిశారు. ఆ తర్వాత ఇది రాజకీయ కలయిక కాదని, మర్యాదపూర్వక భేటీ అని ఇద్దరూ ప్రకటించారు.
ఇటీవల మరింత ప్రచారం
కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. దీనిపై సత్యనారాయణ మాట్లాడారు. రజనీ రాజకీయాల్లోకి రారని, ఆయన రావాలని తాను కోరుకున్నానని చెప్పారు. తమిళనాడుకు మంచి చేసే అలాంటి వారు రాజకీయాల్లో చేరాలని కోరుకున్నట్లు తెలిపారు.
లింగా సినిమా ఆడియో వేడుక సమయంలో మాత్రం రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ అందులోని లోతు, ప్రమాదం గురించి నాకు తెలుసు. నేను భయపడట్లేదు, తన మనసులో మాత్రం ఆ ఆలోచన లేదు. దేవుడు కోరుకుంటే.. ప్రజలకు సేవ చేస్తా' అన్నారు.