పాకిస్తాన్ను ఉతికి ఆరేసిన రాజ్నాథ్: ఐఎస్ఐపై ప్రశ్న
గౌహతి: ఉగ్రవాదం విషయంలో భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ తీరును ఉతికి ఆరేశారు. ఐఎస్ఐ ప్రభుత్వేతర పాత్రధారియా అని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్లోని అర్నియాలో మిలిటెంట్ల దాడిని ప్రస్తావిస్తూ ప్రభుత్వేతర సంస్థలు ఆ దాడికి పాల్పడ్డాయని పాకిస్తాన్ చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. ఐఎస్ఐ ప్రభుత్వేతర సంస్థనా అని అడిగారు.
అసోం రాజధాని గౌహతిలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల డిజిపిలు, ఐబి అధికారుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. దేశరక్షమలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. దేశం ఎదుర్కుంటున్న ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై ఆయన సమీక్ష చేశారు. ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైందని ఆయన హెచ్చరించారు.
ఉగ్రవాదాన్ని అత్యంత తీవ్రమైన సంస్యగా పరిగణిస్తున్నామని, ఈ అంశాన్ని చిన్నదిగా చూడబోమని రాజ్నాథ్ అన్నారు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా పలు దురాగతాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. దేశ సరిహద్దుల్లోని ప్రజలకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
2019 నాటికి దేశంలోని అన్ని జాతీయ రహదారుల్లో సిటి కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన గుర్తు చేశారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇంతలా ఓటింగ్ జరగడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఇంత ఓటింగ్ జరగడం గతంలో తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. దానికితోడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. దేశ తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను మరింత పెంచాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. దేశ విపత్తు సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్జిఎఎం కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.