2019 ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణం: సాక్షి మహారాజ్
ఉన్నవ్: అయోధ్యలో రామమందిరం అంశం పైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ)లు మరోసారి లేవనెత్తుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు సాక్షి మహారాజ్ ఆ అంశంపై మాట్లాడారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం 2019 ఎన్నికల కంటే ముందే పూర్తి అవుతుందన్నారు. అయోధ్యలో గతంలో రామ మందిరం ఉండేదని, ఇప్పుడు కూడా రామ్లాలా ఆలయం ఉందని చెప్పారు. అద్భుతమైన ఆలయ నిర్మాణం మాత్రం చేయవలసి ఉందని అభిప్రాయపడ్డారు.
2019లోగా దివ్యమైన రామమందిర నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అది భారతీయ జనతా పార్టీ వ్యవహారం కాదని, తమలాంటి సాధువుల పని అని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాక్షి మహరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. సూర్యుడు వేడిమినీ, చంద్రుడు చల్లదనాన్ని కోల్పోవచ్చు.. గంగానది హిమాలయాలకు వెనుదిరిగి వెళ్లిపోవచ్చు.. అయోధ్యలో మాత్రం బాబ్రీ పేరిట ఎవరూ ఒక్క ఇటుకైనా పెట్టలేరన్నారు. రామ మందిరం ఉందని, దానికి దివ్యమైన, భవ్యమైన నిర్మాణం చేయాలన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇది జాతి కోసం చేపట్టే నిర్మాణమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ మంగళవారం చెప్పడం గమనార్హం.
అయితే, రామ మందిర నిర్మాణానికి ఉభయులకూ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం సాయం మాత్రమే చేస్తుందన్నారు. ఎప్పటి నుండో పోరాడుతున్న సంస్థలే రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఒకవేళ ఆ స్థలం అందుబాటులో ఉంటే ఆలయ నిర్మాణం మొదలవుతుందన్నారు.