రేప్ కేసు, వీర్య పరీక్షలు: హై కోర్టుకు వెళ్లిన స్వామిజీ
బెంగళూరు: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రాపుర మఠాధిపతి రాఘవేశ్వర భారతీ స్వామిజీ హై కోర్టును ఆశ్రయించారు. తనకు నిర్వహించే వైద్య పరీక్షలను నిలిపివేయాలని హై కోర్టులో అర్జీ సమర్పించారు.
రామకథ గాయిని మీద రాఘవేశ్వర భారతీ స్వామిజీ కొన్ని నెలల పాటు అత్యాచారం చేశారని ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్వామిజీకి వీర్య పరీక్షలు నిర్వహించాలని సీఐడి అధికారులు నిర్ణయించారు.
సెప్టెంబర్ 30వ తేది ఉదయం 9 గంటలకు బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు హాజరు కావాలని సీఐడి అధికారులు స్వామిజీకి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్వామిజీ తరుపున ఆయన న్యాయవాది పి.ఎన్. మన్మోహన్ హై కోర్టులో అర్జీ సమర్పించారు.
బుధవారం హై కోర్టు న్యాయమూర్తి ఎ.ఎస్. బోపణ్ణ అర్జీ విచారణ చేశారు. వీర్య పరీక్షలు చెయ్యడం వలన స్వామిజీ మఠంలో పరిపాలన సాగించడానికి ఇబ్బంది కలుగుతుందని ఆయన న్యాయవాది హై కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
అర్జీ విచారణ చేసిన న్యాయమూర్తి విచారణ ఈ నెల 26వ తేది శనివారానికి వాయిదా వేశారు. అయితే స్వామిజీకి కచ్చితంగా వీర్య పరీక్షలు నిర్వహించి ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి తీసుకురావాలని సీఐడి అధికారులు భావిస్తున్నారు.