ఆ శక్తి కెసిఆర్కు ఉంది: రమణ్ సింగ్, కెసిఆర్ థ్యాంక్స్
రాయ్పూర్: తెలంగాణ రాష్ట్రంతో బలమైన సంబంధాన్ని కోరుకుంటున్నామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం రమణ్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే.
తెలంగాణకు విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు సోమవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రమణ్ సింగ్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్ని సమస్యలుంటాయో తమకు తెలుసని రమణ్ సింగ్ తెలిపారు.
ఆ సమస్యలను అధిగమించే శక్తి తెలంగాణ సిఎం కెసిఆర్కు ఉందని అన్నారు. కరెంటు సరఫరా కోసం విద్యుత్ సరఫరా లైన్లను త్వరగా నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్లు రమణ్ సింగ్ చెప్పారు. తెలంగాణకు అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రమణ్ సింగ్ తెలిపారు.
రమణ్ సింగ్కు కెసిఆర్ కృతజ్ఞతలు
విద్యుత్ సరఫరాకు అంగీకరించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య సంబంధం ఈనాటిది కాదని అన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పూర్వకాలం నుంచే సంబంధాలున్నాయని చెప్పారు. తమ కాకతీయ రాజ్యానికి చెందిన అవశేషాలు ఇంకా ఇక్కడే ఉన్నాయని గుర్తు చేశారు.
మొక్కలు నాటిన కెసిఆర్
ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోవామరం ఆ రాష్ట్ర రాజధాని నయా రాయ్పూర్ను సందర్శించారు. నయారాయ్పూర్లో సిఎం కెసిఆర్ మొక్కలు నాటారు. మహాభవన్ పేరిట నిర్మిస్తున్న సచివాలయంతోపాటు అక్కడి రోడ్లను, ఐటి పార్క్, శాసనసభ, ఎల్ఈడీ సోలార్ దీపాలను పరిశీలించారు.
ఆదివారం ఛత్తీస్గఢ్ చేరుకున్న సిఎం అక్కడ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఛత్తీస్గఢ్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. సోమవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో సిఎం కెసిఆర్ ఛత్తీస్గఢ్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.