భూకంపం: సీఎం శివరాజ్ సింగ్ పరుగు, రాందేవ్కు తప్పిన ప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం నాటి భూప్రకంపనల తీవ్రతను స్వయంగా చవి చూశారు. ఆయన తన అనుభవాన్ని విలేకరులతో పంచుకున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఐదో అంతస్థులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో 11.45 గంటలకు తన తల తిరిగినట్లనిపించిందని చెప్పారు.
ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్ర్కీన్లు కదులుతుండటం స్పష్టంగా కనిపించిందని చెప్పారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి మెట్ల మార్గం గుండా ఐదో అంతస్తు నుంచి శరవేగంగా కిందకు దిగిపోయానని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
రామ్ దేవ్ బాబాకు తప్పిన ముప్పు
ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా భూకంప ధాటి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. శుక్రవారం నుంచి ఆయన ఖాట్మండులో యోగా శిబిరం నిర్వహిస్తున్నారు. శనివారం తుండి ఖేల్ మైదాన్లో వేదికపై నుంచి యోగా శిక్షణ ఇచ్చారు. ఆయన కిందికి దిగిన కొద్దిసేపటికే భూకంపం వచ్చింది.
అప్పటిదాకా ఆయన ఉన్న వేదిక కూడా కుప్పకూలింది. తన కళ్లముందే ఒక పెద్ద భవంతి కుప్పకూలిందని, అందులో ఎంతోమంది చిక్కుకుపోయారని, తీవ్ర విధ్వంసం జరిగిందని రామ్ దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను నేపాల్లోనే ఉండి పతంజలి యోగపీఠం తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రామ్ దేవ్ తెలిపారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆయనతో మాట్లాడారు. భారత్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పామని అయితే, ఆయన అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటానని చెప్పారని సుష్మా స్వరాజ్ చెప్పారు.