భాగ్యనగరంలో భోజనం.. అమరావతిలో టీ: కోవింద్ రాకకై వేచిచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరఫున పోటీ పడుతున్న రామ్ నాథ్ కోవింద్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలో ఆయన హైదరాబాద్, విజయవాడల్లో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరఫున పోటీ పడుతున్న రామ్ నాథ్ కోవింద్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలో ఆయన హైదరాబాద్, విజయవాడల్లో పర్యటించనున్నారు.
తనకు మద్దతు పలికిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ మంత్రులతో, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులతో రామ్ నాథ్ కోవింద్ సమావేశమై కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
తన ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు రానున్న ఆయనకు ఘనమైన విందు భోజనాన్ని సిద్ధం చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రుచికరమైన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో భోజనం చేసే కోవింద్, ఆపై అమరావతిలో మాత్రం సాయంకాల అల్పాహార విందు, తేనీరు తీసుకోనున్నారు.
నిజానికి ఈ వారంలోనే ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కంటి శస్త్ర చికిత్స నిమిత్తం ఢిల్లీలో ఉండిపోయారు. అలాగే నెలాఖరులో జీఎస్టీ అమల్లోకి రానుండగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే ఆ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనుండటంతో కోవింద్ పర్యటన వచ్చే వారానికి వాయిదా పడింది.