బాధితురాలితో పెళ్లికి ఓకే: రేప్ నిందితుడికి బెయిల్ ఇచ్చిన కోర్టు
ముంబై: అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడుకి బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాను అత్యాచారానికి పాల్పడిన బాధితురాలిని వివాహం చేసుకునేందుకు నిందితుడు అంగీకరించడంతో అతనికి న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ గడ్కరీ బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.
యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు జయంత్ జాదవ్పై ఏప్రిల్ 4న ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన యువతితో జాదవ్ పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో శరీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు.
కాగా, ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు జాదవ్తో ఆమెకు వివాహం జరిపించాలని అతని తల్లిదండ్రులను కోరారు. జాదవ్ తల్లిదండ్రులు వీరికి వివాహం చేసేందుకు నిరాకరించడంతో బాధితురాలి తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో నిందితుడు జాదవ్.. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు అతనికి మే 28 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక, భవిష్యత్లో ఆ యువతికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని జాదవ్, అతడి కుటుంబసభ్యులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది.