విమానంలో ఎలుకలుపడ్డాయ్: అత్యవసర ల్యాండింగ్
లెహ్: ఎలుకలు తలుచుకుంటే అంతే ఏమైనా చేస్తాయని రుజువు అయ్యింది. వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఎలుకల దెబ్బకు ఏకంగా భూమి మీదకు దిగవలసి వచ్చింది. విమానంలో ఎలుకలు ఉన్నాయని గుర్తించిన పైలెట్లు అత్యవసరంగా విమానాన్ని కిందకు దించి ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియాకు చెందిన ఏ-320 విమానం బయలుదేరింది. అందులో 90 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం బయలుదేరిన 22 నిమిషాల తరువాత పైలెట్లకు సాంకేతిక లోపం విషయంలో అనుమానం వచ్చింది.
విమానంలో ఎలుకలుపడ్డాయని గుర్తించారు. ఎలుకలు విమానంలోని ఎలక్ట్రికల్ వైర్లు కోరికివేస్తే సాంకేతిక లోపం, సమాచార లోపం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని పసిగట్టారు. వెంటనే జమ్మూ కాశ్మీర్ లోని లెహ్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న విమానాశ్రయం సిబ్బంది విమానం దగ్గరకు చేరుకున్నారు. విమానంలో ఎలుకలు పట్టుకునే ఎక్విప్ మెంట్ లేకపోవడంతో వేరే విమానంలో దానిని తెప్పించారు. ఎలుకలను పట్టుకున్న తరువాత విమానం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. క్యాటరింగ్ వాహనాల నుండి ఎలుకలు విమానంలోకి వచ్చాయని అధికారులు తెలిపారు.