‘రేమండ్’ రారాజుకు కొడుకు కష్టాలు: రోడ్డున పడేయడంతో కోర్టు మెట్లెక్కారు
రేమండ్ సంస్థను స్థాపించి దాన్ని ఓ సామ్రాజ్యంగా విస్తరించి రెండు దశాబ్దాలకు పైగా పురుషుల దుస్తుల రంగంలో ఆ బ్రాండ్ను తిరుగులేకుండా నిలిపిన పారిశ్రామిక దిగ్గజం విజయ్పథ్ సింఘానియా(78) .
ముంబై: రేమండ్ సంస్థను స్థాపించి దాన్ని ఓ సామ్రాజ్యంగా విస్తరించి రెండు దశాబ్దాలకు పైగా పురుషుల దుస్తుల రంగంలో ఆ బ్రాండ్ను తిరుగులేకుండా నిలిపిన పారిశ్రామిక దిగ్గజం విజయ్పథ్ సింఘానియా(78) ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియానే కారణం కావడం గమనార్హం. కాగా, తన కొడుకు తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేశారని విజయ్పథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంబైలో సంపన్నుల ప్రాంతంగా పేర్కొనే మలబార్ హిల్స్లో ఆయన సొంత స్థలంపై నిర్మించిన 36 అంతస్థుల 'జేకే హౌస్'లో తనకు రావాల్సిన డ్యూప్లెక్స్ ఇంటి కోసం న్యాయస్థానాన్ని విజయ్పథ్ ఆశ్రయించాల్సి వచ్చింది. భారత సంపన్నులలో ఒకరైన విజయ్పథ్ తనకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని కూడా తన కుమారుడు అప్పగించడం లేదని కోర్టుకెక్కారు.
సంపాదనంతా కొడుక్కే..
కాగా, విజయ్పథ్ సింఘానియా ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తరఫు న్యాయవాది బుధవారం బొంబాయి హైకోర్టుకు విన్నవించారు. ఉన్న సంపదనంతా కుమారుడికి అప్పగించగా... అతడు మాత్రం తండ్రికి ఎలాంటి ఆస్తి లేకుండా చేశారని తెలిపారు. రేమండ్ సంస్థలో ఉన్న రూ.1000 కోట్ల విలువైన షేర్లన్నిటినీ కూడా విజయ్పథ్ తన కుమారుడి పరం చేశారన్నారు.
Recommended Video
ఇప్పుడు అద్దె ఇంట్లో...
చివరకు విజయ్పథ్ సింఘానియా ఇప్పుడు దక్షిణ ముంబైలోని గ్రాండ్ పరాడీ సొసైటీలో ఓ అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారని వివరించారు. ఇంత ఆస్తినీ పొందిన గౌతమ్ ఇప్పుడు వృద్ధుడైన తన తండ్రికి కనీసం కారు, డ్రైవర్ లేకుండా చేసేశారని న్యాయస్థానానికి విన్నవించారు.
అమలుకాని ఒప్పందాలు..
వాస్తవానికి విజయ్పథ్ సింఘానియానే 1960లో 14 అంతస్తుల ‘జేకేహౌస్'ను నిర్మించారు. ఆ భవంతిలోని 4 డ్యూప్లెక్స్లను ‘రేమండ్' అనుబంధ సంస్థ అయిన ‘పష్మినా హోల్డింగ్స్'కు అప్పగించారు. ఆ తర్వాత 2007లో ఆ 14 అంతస్తుల భవనం స్థానంలో కొత్త నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని రేమండ్ కంపెనీయే నిర్ణయించింది. ఆ మేరకు 36 అంతస్తుల భవంతి నిర్మితమైంది. ఈ విషయమై కుదిరిన ఒప్పందం ప్రకారం విజయ్పథ్ సింఘానియా సోదరుడు అజయ్పథ్ సింఘానియా భార్య వీణాదేవికి, ఆమె కుమారులైన అనంత్, అక్షయ్పథ్ సింఘానియాలకు తలో డ్యూప్లెక్స్ రావలసి ఉంది. అవేవీ కూడా ఆచరణలోకి రాకపోవడంతో వారు కూడా గౌతమ్పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సింఘానియాకు రావాల్సినవి..
కాగా, విజయ్పథ్ సింఘానియాకు నెలకు రూ.7లక్షల చొప్పున కంపెనీ నుంచి రావాల్సి ఉందని, అంతేగాక, కంపెనీ ఖర్చులతో ఆయనకు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాల్సి ఉందని న్యాయవాది తెలిపారు. కాగా, ఆగస్టు 18 నాటికల్లా దీనిపై సమాధానాన్ని దాఖలు చేయాల్సిందిగా రేమాండ్స్ సంస్థను కోర్టు కోరింది. ఆగస్టు 22న దీనిపై తదుపరి విచారణ జరుగుతుంది.