సారీ.. తమిళ్ నేర్చుకుంటున్నా: అమిత్ షా సెంటిమెంట్, ఏపీ, టీల పైనా..
చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడులో ప్రాంతీయ పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఆయన తమిళం కూడా నేర్చుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా సాగుతున్న బీజేపీ తన యత్నాలను ముమ్మరం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల మనోభావాలను గెలుచుకునే దిశగా పార్టీ అమిత్ షా తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు రాజధాని చెన్నై వచ్చిన ఆయన శనివారం నాడు బహిరంగసభలో తమిళుల మనసును తాకేలా మాట్లాడారు.
తమిళులకు స్వభాషాభిమానం ఎక్కువన్న విషయాన్ని పసిగట్టిన అమిత్ షా.. దానినే ఆయుధంగా తీసుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు చెన్నైవాసులకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, తాను తమిళం నేర్చుకోవడం ప్రారంభించానని, త్వరలో తమిళంలోనే మాట్లాడుతానని చెప్పారు.
తమిళనాడులో ద్రవిడ పార్టీల పాలనకు త్వరలో ముగింపు పలుకుతామన్నారు. తమిళ ప్రజలు కేవలం నరేంద్ర మోడీ పాలనలోనే గౌరవంగా బతకగలరని చెప్పారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో బీజేపీని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు.
మతమార్పిడులపై...
దేశంలో మతమార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, లౌకిక ముసుగులో ఉన్న పార్టీలు దమ్ముంటే పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కొచ్చిన్లో రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
అనంతరం చెన్నైలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఆయన చెన్నైలో పర్యటించనున్నారు. ఈ దేశంలో బలవంతపు మతమార్పిడులను వ్యతిరేకించే ఏకైక పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మతప్రాతిపదికన విడగొట్టే ప్రయత్నాలు చేస్తుందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ విమర్శలపై.. తమ ప్రభుత్వం అలా వ్యవహరించదని స్పష్టం చేశారు.
పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికన్నా ఆరు నెలల్లో ఎన్డీయే సర్కార్ చేసిందే ఎక్కువని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేరళలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సైతం. మతమార్పిడుల అంశంపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే మతమార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఒక హిందుత్వ సంస్థ చేపట్టిన వివాదాస్పద ఘర్ వాపసీ గురించి అడగ్గా, ఈ విషయం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయం వెలువడే దాకా తాను ఈ విషయంపై ఏమీ వ్యాఖ్యానించనని చెప్పారు.