ప్రధాని మోడీతో పళనిసామి భేటీ: డిమాండ్ల చిట్టా ఇచ్చి, కాపాడాలని !
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని కరువు సహాయంగా గతంలో కోరిన రూ. 39,565 కోట్లు, వర్దా తుపాను సహాయం కింద రూ. 22,573 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మొదటిసారి ఢిల్లీకి చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడుకు సహాయం చెయ్యాలని పళనిసామి మోడీకి మనవి చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి పళనిసామి మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు సమస్యలు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కరువుకాటకాలు, వర్దాతుపాను దెబ్బతో తమిళనాడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సంగతిని ప్రధానికి వివరించామని పళనిసామి చెప్పారు.
తమిళ ప్రజల జల్లికట్టుకోర్కె సాధనకై రాష్ట్రం జారీ చేసిన అర్డినెన్స్ ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపానని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు నెలకొని పచ్చని పోలాలు ఎండిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించానని పళనిసామి చెప్పారు.
కరువు సహాయంగా గతంలో కోరిన రూ. 39,565 కోట్లు, వర్దా తుపాను సహాయం కింద రూ. 22,573 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 17,333 కోట్లు వెంటనే విడుదల చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశానని పళనిసామి వివరించారు.
నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని, కావేరీ ట్రిబ్యునల్ తీర్ప ప్రకారం అభివృద్ది మండలి, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చెయ్యాలని కోరానని, తమిళనాడుకు అదనంగా నెలకు 85 వేల మెట్రీక్ టన్నుల బియ్యం రాయితీపై సరఫరా చెయ్యాలని మనవి చేశానని వివరించారు.
తమిళనాడులో సాగు, తాగునీటి కొరతను తీర్చేందుకు మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, పాలారు, కావేరీ, వైగై తదితర నదులు అనుసంధానం చెయ్యాలని మనవి చేశానని పళనిసామి వివరించారు. తమిళనాడు జాలర్ల సంక్షేమం కోసం రూ. 1,650 కోట్లు కేటాయించాలని చెప్పామని అన్నారు.
శ్రీలంక చెరలో ఉన్న 35 మంది తమిళ జాలర్లును, 120 పడవలను విడిపించాలని, శ్రీలంక కారణంగా చేపలు వేటకు ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించాలని మనవి చేశానని, కూడంకుళంలో ఉత్పత్తి అయ్యే రెండు వేల మోగావాట్ల విద్యుత్ పూర్తిగా తమిళనాడుకు కేటాయించాలని కోరానని పళనిసామి వివరించారు.