గూగుల్ తో జియో చెట్టపట్టాల్... ఈ ఏడాది చివర్లో 4జి చౌక స్మార్ట్ ఫోన్లు
రిలయన్స్ జియో.. గూగుల్ తో కలిసి 4జీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను రెడీ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో వీటిని విడుదల చేయాలని యోచిస్తోంది.
ముంబై: రిలయన్స్ జియో మరో ఎత్తుగడ వేసింది. గూగుల్ తో కలిసి రహస్యంగా ఓ ప్రాజెక్టు చేస్తోంది. వినియోగదారుడికి అనువైన ధరల్లో సరికొత్త స్మార్ట్ ఫోన్లను రెడీ చేస్తోంది. అదీ కూడా కేవలం జియో 4జీ నెట్ వర్క్ కు మాత్రమే పనిచేసేలా వీటిని రూపొందిస్తోంది.
ఈ ఏడాది చివర్లో జియో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. సరసమైన ధరల్లో స్మార్ట్ ఫోన్లను దేశంలో విడుదల చేయడానికి గూగుల్ కు ఇది రెండో అవకాశం కిందే పేర్కొనాలి. 2014 సెప్టెంబర్ లో గూగుల్ ఆండ్రాయిడ్ వన్ పేరుతో ఇలాంటి ఫోన్ ను విడుదల చేసింది.
అయితే ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. దీని తరువాత మళ్లీ గూగుల్ మరోసారి రిలయన్స్ జియోతో జట్టుకట్టి తన రెండో ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు, ఈ రెండూ కలిసి రిలయన్స్ జియో స్మార్ట్ టీవీలకు సాఫ్ట్ వేర్ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది తరువాత వీటిని విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం టెలికాం మార్కెట్ లో జియో 100 మిలియన్ ఖతాదారులను దాటి పోయింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్టును మరోసారి, మరో రూపంలో మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయి గూగుల్, జియో.