జియో మరో బంపర్ ఆఫర్! : కస్టమర్లకు పండగే
న్యూఢిల్లీ : జియో దెబ్బతో టెలికాం కస్టమర్లందరినీ తనవైపుకు తిప్పుకున్న రిలయన్స్.. మరో బంపర్ ఆఫర్ ప్రకటించబోతుంది. జియో దెబ్బతో ఇప్పటికే నష్టాల చవిచూస్తోన్న మిగతా టెలికాం కంపెనీలకు ఇది మరింత ప్రతికూల పరిణామమే. మరోవైపు జియో కస్టమర్లకు మాత్రం ఇది బోనస్ గుడ్ న్యూస్ లాంటిదే.
ఇంతకీ విషయమేంటంటే.. ఇప్పటికే ప్రకటించిన జియో ఫ్రీ వాయిస్ కాల్ ఆఫర్ డిసెంబరు 3తో ముగియనుండడంతో.. ఈ ఆఫర్ ను మరో మూడు నెలల పాటు పొడగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంటే, మార్చి 2017 వరకు జియో ఫ్రీ వాయిస్ కాల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
మొత్తం మీద రిలయన్స్ నిర్దేశించుకున్న 10కోట్ల మంది టార్గెట్ ను ఈ ఆఫర్ల ద్వారా చేరుకోవాలని ఆశిస్తోంది. అయితే రిలయన్స్ ప్రకటించిన తాజా ఆఫర్ కు టెలికాం టారిఫ్ నిబంధనలు ప్రతికూలంగా ఉండడంతో.. ఈ ఆఫర్ పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్(2004) ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ ను 90 రోజులకు మించి అందుబాటులో ఉంచడానికి అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో.. నిబంధనలకు విరుద్దంగా జియో ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫర్ ను మూడు నెలల పాటు ఎలా కొనసాగిస్తుందనేది సర్వత్రా వ్యక్తమవుతోన్న ప్రశ్న. దీనిపై స్పందించిన జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ హెడ్ అన్షుమన్ ఠాకూర్ మాత్రం డిసెంబరు తర్వాత ఉచిత సేవలు కొనసాగించేందుకు ట్రాయ్ అనుమతితో పనిలేదని చెప్పడం గమనార్హం.
లాంచింగ్ సమయంలో వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు సేవలను అందించకుండా, వారి నుంచి చార్జీలు వసూలు చేయాలనుకోవడం కూడా చట్ట విరుద్ధమన్న కోణంలో ఫ్రీ సర్వీసెస్ ను పొడగించేందుకు జియో సిద్ధమవుతోంది.