బయటపడుతున్న రింగింగ్ బెల్స్ బాగోతం: విచారణలో విస్తుపోయే విషయాలు..
రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామంటూ దేశం దృష్టిని మొత్తం తనవైపుకు తిప్పుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ అసలు బాగోతం బయటపడుతోంది. తమ సంస్థను మోసం చేశాడంటూ ఆయామ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఫిర్యాదు చేయడంతో ఘ
ఘజియాబాద్: రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామంటూ దేశం దృష్టిని మొత్తం తనవైపుకు తిప్పుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ అసలు బాగోతం బయటపడుతోంది. తమ సంస్థను మోసం చేశాడంటూ ఆయామ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఫిర్యాదు చేయడంతో ఘజియాబాద్ పోలీసులు మోహిత్ గోయెల్ ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా మోహిత్ పలు విస్తుగొలిపే విషయాలను వెల్లడించాడు. వాస్తవానికి తాను చదివింది ఎనిమిదో తరగతి మాత్రమేనని, అది కూడా పాసవ్వలేదని, కానీ లింక్డ్ ఇన్ వెబ్ సైట్ లో ఆమిటి యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లీష్ విషయానికొస్తే..స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు చేశానని మోహిత్ పోలీసులకు తెలిపాడు.
కాగా, రూ.16లక్షల మేర తమ సంస్థకు టోకరా వేశారంటూ ఆయామ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ మోహిత్ పై ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గురువారం నాడు అతన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
రింగింగ్ బెల్స్ ఉత్పత్తుల కోసం తమ సంస్థ రూ.30లక్షలు చెల్లించగా.. కేవలం రూ.14లక్షల విలువ చేసే ఉత్పత్తులను మాత్రమే ఇప్పటివరకు తమకు అందించారని ఆయామ్ ఎంటర్ ప్రైజెస్ ఫిర్యాదులో పేర్కొంది.
ఇక గతేడాది రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ ఊదరగొట్టిన రింగింగ్ బెల్స్ సంస్థ.. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా విజన్ కు ఇది తోడ్పడుతుందని ప్రకటించడం గమనార్హం. నిజానికి ఈ సంస్థకు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా లేనట్లుగా తెలుస్తోంది. చైనా మార్కెట్ లో కొన్ని వందల కొద్ది ఫోన్లను విక్రయించి వాటినే రీ-బ్రాండెడ్ చేసినట్లు చెబుతున్నారు.