"ఎవరేమనుకున్నా పట్టించుకోను.. నితీశ్ కు నా సత్తా చూపిస్తా"
సివాన్ : బీహార్ వివాదస్పద నేత, ఆర్జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్ శుక్రవారం మధ్యాహ్నాం సివాన్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. రాజీవ్ రోషన్ అతని ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న షహబుద్దీన్ కు బీహార్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీం రద్దు చేసిన నేపథ్యంలో.. ఆయన లొంగిపోక తప్పలేదు.
కాగా, కోర్టులో లొంగిపోతున్న సందర్బంగా షహబుద్దీన్ నితీశ్ కు ఒకింత హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు షహబుద్దీన్. 'నేనెవరికీ భయపడే వ్యక్తిని కాను. ప్రజలు ఏమనుకుంటారన్నది పట్టించుకోను, న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకముంది. సీఎం నితీశ్ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. వచ్చే ఎన్నికలకు నా అనుచరులు నితీశ్ కు సత్తా చూపిస్తారు' అంటూ నితీశ్ ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు షహబుద్దీన్.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత ముఖ్య అనుచరుడిగా పేరున్న షహబుద్దీన్.. రాజీవ్ రోషన్, అతడి సోదరుల హత్య కేసులో 11ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సెప్టెంబర్ 7న బీహార్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో.. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నితీశ్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీంతో స్పందించిన సుప్రీం.. బెయిల్ రద్దు చేసింది.