ప్రముఖ కార్జూనిస్ట్ ఆర్కె లక్ష్మణ్ కన్నుమూత
ముంబై: ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్(94) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం పూనెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడిగా, ఆర్కే నారాయణ తమ్ముడిగా ప్రసిద్ధ చెందిన ఆర్కే లక్ష్మణ్ పూర్తిపేరు రాశిపురం రాశిపురం కృష్ణ స్వామి లక్ష్మణ్.
ఆయన 1921 అక్టోబర్ 24న కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు. కన్నడ పత్రిక కొరవంజిలో కార్టూనిస్టుగా జీవితాన్ని ఆరంభించిన లక్ష్మణ్ అనంతర కాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. దాదాపు 50 ఏళ్లపాటు ఆ పత్రికకు తన సేవలందించారు. లక్ష్మణ్ భార్య కమల కూడా గొప్ప రచయిత్రిగా ప్రసిద్ధి గడించారు.
సామాన్యుడిని ఆర్కె లక్ష్మణ్ అమరజీవిని చేశారు. యాభై ఏళ్ల పాటు ఆయన తన కార్టూన్ల కోసం ప్రజలు నిరీక్షించేలా పనిచేశారు. రాజకీయాల్లోని హిపోక్రసీని ఆయన తన కార్టూన్లలో చిత్రిక కట్టారు. ఆయన కార్టూన్లకు రాజకీయ నాయకులు ముఖాలు ఎర్రబారేవి. ఆయన తోబుట్టువులు ఏడుగురు. ఆయన అన్నయ్య ఆర్కె నారయణ్ మంచి నవలాకారుడు.
పాఠశాల రోజుల నుంచే లక్ష్మణ్ బొమ్మలూ గీస్తూ వచ్చాడు. బ్రిటిష్ కార్టూనిస్టు సర్ డేవిడ్ లో తొలి రోజుల్లో ఆయనకు స్ఫూర్తి. తర్వాతి కాలంలో ఆయన కార్టూన్లలో కాకి అతి సాధారణంగా కనిపిస్తూ వచ్చింది. మైసూరు విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్ట్స్లో డిగ్రీ చేశారు. డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే బ్లిట్జ్, స్వరాజ్యలకు కార్టూన్లను అందించేవారు.
మైసూరు మహరాజా కాలేజీలో ఉన్నప్పుడే ఆయన ఆర్కె నారాయణన్ కథానికలకు ది హిందూలో బొమ్మలు వేస్తూ వచ్చారు. స్థానిక పత్రికలకు రాజకీయ కార్జూన్లు వేస్తూ వచ్చారు. ఫ్రీ ప్రెస్ జర్నల్లో ఆయన పూర్తి స్థాయి రాజకీయ కార్జూనిస్టుగా చేరారు. అదే పత్రికలో పనిచేస్తున్న బాల్ థాకరేతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 50 ఏళ్ల పాటు పనిచేశారు. యూ సెడ్ ఇట్ అనే పేర ఆయన అందించిన కామన్ మ్యాన్ కార్టూన్ అత్యంత ప్రసిద్ధి చెందింది.