సునామీ కారణంగా నాశనమైన తొలి కట్టడం ఏదో తెలుసా?
పనాజీ: ప్రపంచంలో సునామీ వల్ల నాశనమైన అతి పురాతనమైన తొలి కట్టడాన్ని తాము కనుగొన్నామని సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు ప్రకటించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డైరెక్టర్ నక్వి సోమవారం మీడియాతో మాట్లాడుతూ గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో ఉన్న ధోలవిరా ప్రపంచంలో మంచి ప్లాన్తో నిర్మించిన తొలి నగరమని తెలిపారు.
ఇది దాదాపు 3450 ఏళ్ల కిందట సునామీ కారణంగా నేలమట్టమైందని తాము భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఐదు వేల సంవత్సరాల కిందట సింధులోయ నాగరికతలో ఉన్న మెట్రో పాలిటన్ నగరంగా ధోలవిరా విరాజిల్లిందని ఆయన తెలిపారు.
హరప్పన్లకు ధోలవిరా నౌకాయాన కేంద్రంగా సేవలు అందించిందని ఆయన అన్నారు. ధోలవిరా నగరంలో 14 నుంచి 18 మీటర్ల వెడల్పు ఉన్న గోడల నిర్మాణాలు బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ నగరం మూడు భాగాలుగా ఉందని అన్నారు.
కోట, మధ్య నగరం, దిగువ నగరంగా విడదీసి కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. సునామీల నుంచి తమను తాము రక్షించుకునేందుకే ఇక్కడ 14 నుంచి 18 మీటర్ల వెడల్పు ఉన్న గోడలను నిర్మించారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ సైంటిస్ట్ రాజీవ్ నిగమ్ వెల్లడించారు.