తమిళనాడు: ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి, తిరిగి ప్రారంభమైన బస్సులు
చెన్నై: తమిళనాడులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణగిరి జిల్లా ఊట్టంకరై వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. కృష్ణగిరి నుంచి తిరువణ్ణామలై వెళుతున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కారులోని నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకున్నారు. మృతులు తిరుపుత్తూరు ఓమకుప్పం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో వ్యక్తిని మెరుగైన చికిత్సకోసం ఆసుపత్రి తరలించారు.
ఏపీ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం
ఏపీ రాష్ట్రం నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు ప్రారంభమైయ్యాయి. తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సు సర్వీసులని తిరిగి పునరుద్ధరించింది.
చిత్తూరు శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొంత కాలంగా తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు చేయడంతో, ఏపీఎస్ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
దీంతో రెండు రాష్ట్రాలు ఆర్టీసీలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఎన్కౌంటర్ ఘటనపై విచారణ వేగవంతం కావడంతో ఇరు రాష్ర్టాల ఆందోళనల విరమణతో ఆదివారం నుంచి బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమైయ్యాయి.