మోడీకి సొంతవారి నుండే షాక్, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ధర్నా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి షాక్! భూసేకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోంది. కేంద్రం తెస్తున్న భూసేకరణ బిల్లుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బిల్లు పైన సొంత వారి నుండే బీజేపికి చిక్కులు వస్తుండటం గమనార్హం.
భూసేకరణ బిల్లు పైన విపక్షాల తీరును బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొంటోందనే చెప్పవచ్చు. కానీ, సొంత మనుషుల నుండి వ్యతిరేకత రావడం బీజేపీని ఇరకాటంలో పడేసిందని చెప్పవచ్చు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ సంస్థల్లో ఒకటైన స్వదేశీ జాగరణ్ మంచ్ భూసేకరణ బిల్లు సవరణలను వ్యతిరేకిస్తోంది.
దీనిని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతోంది. భూసేకరణ బిల్లును ఆమోదిస్తే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్వదేశీ జాగరణ్ మంచ్ నేతలు హెచ్చరిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు.
ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే దీన్దయాల్ ఉపాధ్యాయ ఐడియాలజీని పక్కన పెట్టినట్లుగా ఉందని ఆరోపించారు. భూసేకఱణ బిల్లుకు భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్లు నిరసన తెలుపుతున్నాయని గోవిందాచార్య అనే స్వదేశీ జాగరణ్ మంచ్ నేత అన్నారు.
విప్ జారీ చేసిన బీజేపీ
బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. కీలక బిల్లుల ఓటింగ్ సమయంలో పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. స్థిరాస్థి నియంత్రణ బిల్లు తీర్మానాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు.