బీజేపీలో చేరుతున్న మాజీ సీఎం కృష్ణ: తేల్చేసిన యడ్యూరప్ప
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు కర్ణాటక బేజేపీ చీఫ్ యడ్యూరప్ప అధికారికంగా ప్రకటించారు.
న్యూడిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు కర్ణాటక బేజేపీ చీఫ్ యడ్యూరప్ప అధికారికంగా ప్రకటించారు. ఎస్ఎం కృష్ణ త్వరలోనే బీజేపీలో చేరతారని స్పష్టం చేశారు.
యడ్యూరప్ప శనివారం మాట్లాడుతూ.. ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. అయితే, ఎప్పుడనేది కచ్చితంగా తెలియదుదని అన్నారు. కానీ, ఆయన బీజేపీలో చేరతారని వంద శాతం కచ్చితంగా చెప్పగలనని తేల్చి చెప్పారు.
వయసు కారణంగా కాంగ్రెస్ తనకి ప్రాధాన్యం ఇవ్వటంలేదని ఆరోపిస్తూ ఎస్ఎం కృష్ణ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. నమ్మకమైన పార్టీ కార్యకర్తలను పక్కకు తప్పించటానికి వయసును ప్రామాణికంగా ఎలా తీసుకుంటారని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.
కాగా, పలువురు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కృష్ణా, కావేరీ జలాల విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఒక వేళ ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరినట్లయితే పాత మైసూరు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.