ఘర్షణ: సచిన్ పైలట్ సహా 40 మందికి గాయాలు
జైపూర్: పోలీసులకు, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య రాజస్థాన్లో మంగళవారం జరిగిన ఘర్షణలో 40 మంది వ్యక్తులు, పది మంది పోలీసులు గాయపడ్డారు. కాంగ్రెసు చీఫ్ సచిన్ పైలట్ సహా 40 మంది గాయపడ్డారు. భూ సేకరణ అర్డినెన్స్కు వ్యతిరేకంగా శాసనసభ ఘెరావ్ కార్యక్రమాన్ని కాంగ్రెసు పార్టీ చేపట్టింది. ఈ సందర్భంగా ఘర్షణ చెలరేగింది.
పది మంది పోలీసులు, చాలా మంది కాంగ్రెసు కార్యకర్తలతో పాటు సచిన్ పైలట్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. లాఠీచార్జీలో సచిన్ పైలట్కు స్వల్పంగా గాయాలైనట్లు పిసిసి అధికార ప్రతినిధి అర్చన శర్మ చెప్పారు. జ్యోతినగర్ పోలీసులు స్టేషన్లో కేసు నమోదైంది.
జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో 30 మందిని చికిత్స నిమిత్తం చేర్చారు. మిగతావారిని ఇతర ఆస్పత్రుల్లో చేర్చారు. శాసనసభలోకి ప్రవేశించడానికి కాంగ్రెసు కార్యకర్తలు బ్యారికేడ్లను తోయడానికి ప్రయత్నించినప్పుడు స్వల్పంగా లాఠీచార్జీ చేసినట్లు డిసిపి రవి దత్త గౌర్ చెప్పారు. దాంతో కాంగ్రెసు కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు విసిరారు.
సచిన్ పైలట్ సహా వంద కాంగ్రెసు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత వదిలేశారు. అంతకు ముందు యువజన కాంగ్రెసు జాతీయాధ్యక్షుడు అమరేంద్ర సింగ్ రాజా, రాష్ట్రాధ్యక్షుడు అశోక్ చందన ఉద్యోగ్ మైదాన్లో సమావేశం ఏర్పాటు చేసి, శాసనసభ వైపు సాగి వచ్చారు.