నవంబర్ 16న నెల్లూరులో సచిన్: షెడ్యూల్ ఖరారు
న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా గూడూరులోని పుత్తమరాజు కండ్రిగ గ్రామానికి రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నవంబర్ 16న వస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ జి. రేఖావాణి చెప్పారు. శుక్రవాం ఆమె తన ఛాంబర్లో విలేకర్లతో ఈ విషయమై మాట్లాడారు.
నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు సచిన్ ముంబై నుంచి చెన్నై చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణపట్నం పోర్టుకు వస్తారని పేర్కొన్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం 9 గంటలకు గూడూరులోని పుత్తమరాజు కండ్రిగకు చేరుకుంటారు.
గ్రామంలో రూ. 3.50 కోట్లతో ఆ గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులను సచిన్ టెండూల్కర్ తన చేతుల మీదగా ప్రారంభిస్తాడు. మధ్యాహ్నాం 12 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు. పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.