శశికళకు పన్నీరు గట్టి షాక్: జయలలితకు ఇచ్చిన మాట తప్పారని తొలగింపు
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ శుక్రవారం నాడు హఠాత్తుగా షాకిచ్చారు. ఆమెను, ఆమె అక్క కొడుకు టీటీవీ దినకరన్ను పార్టీ నుంచి, పదవుల నుంచి తొలగించారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ శుక్రవారం నాడు హఠాత్తుగా షాకిచ్చారు. ఆమెను, ఆమె అక్క కొడుకు టీటీవీ దినకరన్ను పార్టీ నుంచి, పదవుల నుంచి తొలగించారు.
మధుసూదనన్ను శశికళ ఇటీవలే పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించారు. తనను తొలగించిన రెండు మూడు రోజుల తర్వాత.. ఇప్పుడు అదే మధుసూదనన్.. శశికళను, దినకరన్ల పైన వేటు వేయడం గమనార్హం.
అందుకే వేటు..
శశికళకు ఉన్న పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామని, ఆమె పార్టీ నియమాలు, ఆదర్శాలను ఉల్లంఘించారని, జయలలితకు ఇచ్చిన మాటను తప్పారని, అంతేకాకుండా ఆమెపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, పార్టీని అప్రతిష్టపాలు చేశారని మధుసూదనన్ ఓ ప్రకటనలో తెలిపారు.
మధుసూదన్ గతవారం పన్నీర్ వర్గంలో చేరారు. ఆయన స్థానంలో సెంగొట్టియాన్ను శశికళ ప్రిసీడియం ఛైర్మన్గా నియమించారు. అంతేకాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా మధుసూదన్ను శశికళ తప్పించారు. అయితే ఈ చర్యను పన్నీర్ వర్గం ఖండించింది. తనను తప్పించే అధికారం శశికళకు లేదని మధుసూదన్ స్పష్టం చేశారు.
కేవలం శశికళే కాదు దినకరన్, వెంకటేశ్లను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు మధుసూదనన్ ప్రకటించారు. పార్టీని నుంచి వారిని బహిష్కరిస్తున్నట్లు పన్నీర్ సెల్వం కూడా తెలిపారు. నమ్మకద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జయలలిత దినకరన్ పార్టీ నుంచి బహిష్కరించారని మధుసూదనన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే అధికారం వారికి లేదన్నారు.
డ్రామాకు తెరపడలేదు
ఈ పరిస్థితిను చూస్తుంటే తమిళనాడులో.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో పొలిటికల్ డ్రామాకు తెరపడినట్లుగా కనిపించడం లేదు. జయలలిత అసలు వారసులం తామేనని ఇటు శశికళ వర్గం, అటు పన్నీరు సెల్వం వర్గం చెప్పుకుంటోంది. జయ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఇరు వర్గాలు చెబుతుండటం గమనార్హం.
పన్నీరుకు మధు మద్దతు
శశికళను ఎదుర్కొంటున్న పన్నీరు సెల్వంకు మధుసూదనన్ అండగా ఉన్నారు. మధుసూదనన్ ఇప్పుడు శశికళ, దినకరన్లతో పాటు వెంకటేష్ అనే మరో నేత పైన కూడా వేటు వేశారు. వెంకటేష్.. శశికళ వర్గం నేత.
ఎవరిని ఎవరు బహిష్కరించినట్లు..
శశికళ సహా పలువురు నేతలను మధుసూదనన్ తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అతనిని శశికళ పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించారు. ఆయన ఇప్పుడు మళ్లీ శశికళనే తొలగించడం.. చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పన్నీరుతో కలిసినందుకు మధుసూదనన్ను పార్టీ ప్రిసీడియం చైర్మన్ పదవి నుంచి శశికళ తొలగించారు.
రేపే ఫ్లోర్ టెస్ట్
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి శనివారం నాడు బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు శశికళ వర్గం నేతలు పార్టీ విప్ జారీ చేశారు. పన్నీరు సెల్వం వర్గం నేత అయిన మైలాపూర్ ఎమ్మెల్యే నట్రాజ్.. పార్టీ విప్ను పక్కన పెట్టి.. పళనికి కాకుండా.. పన్నీరుకు ఓటేయాలని నిర్ణయించుకున్నారు.