హసీనాతో పంచుకోవాలనే, సింధ్ భారత్లో లేదనే బాధ: ఆద్వానీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని కరాచీ, సింధ్ ప్రాంతాలు భారత్లో భాగం కాలేకపోవడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకు స్వేచ్ఛ వచ్చిందని, కానీ సింధ్ ప్రాంతం దేశం నుంచి విడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పుట్టిన ప్రాంతం, ఇప్పుడు నేను ఉన్న దేశంలో లేకుండా పోయిందన్నారు. అక్కడ పుట్టి, పెరిగిన తనకు, తన మిత్రులకు ఇది ఎంతో బాధాకరమన్నారు. తన చిన్న వయస్సులో సింధ్లో ఉన్నప్పుడు ఆరెస్సెస్లో క్రియాశీలకంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు.
సింధ్ లేని భారత పరిపూర్ణం కాదని అద్వానీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ వచ్చినందున తన ఆవేదనను ఆమెతో పంచుకోవాలనుకున్నానని చెప్పారు. సోమవారం షేక్ హసీనా సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆద్వానీ మాట్లాడారు. కాగా, గతంలోను అద్వానీ సింధ్ గురించి పలుమార్లు మాట్లాడారు.