కొడుకుతో ఆడుకుంటావా! మనవడితోనా?: డిగ్గీపై సాధ్వి
గోరఖ్పూర్: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే.. భారతీయ జనతా పార్టీ మహిళా నేత సాధ్వి ప్రాచీ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను విమర్శిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ పెళ్లి విషయంలోనూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఇటీవల అమృతా సింగ్ అనే మహిళను వివాహమాడిన సంగతి తెలిసిందే.
‘ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు.. కొడుకుతో ఆడుకుంటారా... మనవళ్లతో ఆడుకుంటారా..' అంటూ సాధ్వి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికిరారని.. అది ఆయన తల్లి సోనియాగాంధీకి తెలుసునని, అందుకే రాహుల్ని బిహార్ ఎన్నికల సమయంలో అమెరికా పర్యటనకు పంపారని ఆమె విమర్శించారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పైనా విమర్శలు గుప్పించారు. గడ్డి తిని లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లారని, ఆ సమయంలో ఆయన భార్య ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అలాంటి వ్యక్తి మాటలను బీహార్ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.