సాయి శ్రీనివాస్ అరెస్టు: కృపామణి మృతి కేసులో ట్విస్ట్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో జరిగిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని శనివారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శ్రీనివాస్ను పోలీసులు పట్టుకున్నారు.
గత నెల 24వ తేదీ నుంచి సాయి శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అతను పూణే, కోల్కతా, ముంబై వంటి నగరాల్లో తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో అతనికి ముందస్తు బెయిల్ రావడం కష్టమైందని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సాయి శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. కృపామణిని ఏడు లక్షల రూపాయలకు సాయి శ్రీనివాస్కు విక్రయించి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారనే ఆరోపణపై ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, నాగమల్లీశ్వరరావు, సోదరుడు రాజకుమార్లతో పాటు దాసరి మంగతాయారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. సాయి శ్రీనివాస్ అరెస్టుతో కేసుకు సంబంధించిన మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లయింది.
అయితే, కృపామణి ఆత్మహత్య సంఘటనతో తనకేమీ సంబంధం లేదని సాయి శ్రీనివాస్ అంటున్నాడు. ఆమె మరణించిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉన్నానని చెబుతున్నాడు. అయితే, పోలీసులు మరో కోణంలో కూడా కృపామణి మృతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. కృపామణి తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని, అందుకు కారకులైనవారి వివరాలను చెబుతూ రికార్డు చేసిన వీడియో విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆమె వీడియో రికార్డు చేసే సమయంలో పక్క వేరే వ్యక్తి ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కృపామణి చేత వీడియో రికార్డింగ్ చేయించి, ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అదే నిజమైతే కృపామణి మృతి కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ స్థితిలో పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది.