సంక్షోభం: 30 ఏళ్ళ తర్వాత అన్నాడిఎంకెలో అవే ఘటనలు, నాడు జయదే పై చేయి, నేడు ఎవరో?
అన్నాడిఎంకెలో మూడు దశాబ్దాల క్రితం చోటుచేసుకొన్న పరిణామాలు కన్పిస్తున్నాయి.అన్నాడిఎంకె లో పలు దఫాలు సంక్షోభాలు చోటుచేసుకొన్నాయి. అయితే జయలలిత పార్టీ బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీలో ఆమెకు ఎదురులేకుం
చెన్నై:అన్నాడిఎంకెలో మూడు దశాబ్దాల క్రితం చోటుచేసుకొన్న పరిణామాలు కన్పిస్తున్నాయి.అన్నాడిఎంకె లో పలు దఫాలు సంక్షోభాలు చోటుచేసుకొన్నాయి. అయితే జయలలిత పార్టీ బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీలో ఆమెకు ఎదురులేకుండా పోయింది.ఆమె మరణించిన తర్వాత 30 ఏళ్ళ క్రితం నాటి పరిస్థితులు తిరిగి కన్పిస్తున్నాయి.అయితే ఈ సంక్షోభ సమయంలో ఎవరిది పై చేయిగా మారుతోందననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అన్నాడిఎంకెలో చీఫ్ ఎంజీఆర్ మరణం తర్వాత ఆ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ పగ్గాల కోసం ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాలు తీవ్రంగా ప్రయత్నించాయి.
అయితే ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ఎక్కువ కాలం పార్టీని నడిపించలేకపోయారు.అయితే ఈ పరిస్థితుల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీలోనే జానకీ రామచంద్రన్ వర్గానికి చెందిన నాయకులు కూడ విలీనమయ్యారు.
జయలలితపై పార్టీలో కొందరు తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించి వైఫల్యం చెందారు.పార్టీని ఆమె ఒంటి చేత్తో నడిపించారు. జయలలిత మరణం తర్వాత ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
ఎంజీఆర్ మరణంతో అన్నాడిఎంకెలో సంక్షోభం
అన్నాడిఎంకె చీఫ్ ఎంజీఆర్ మరణం తర్వాత ఆ పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ , అప్పటి పార్టీ ప్రచార కార్యదర్శి జయలలిత నేతృత్వంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో రెండు వర్గాలు కూడ ఆమీతుమీకి సిద్దమయ్యాయి.ఎన్నికల గుర్తు కోసం రెండు వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి.జానకీ రామచంద్రన్ వర్గానికి జంట పావురాలు, జయలలిత వర్గానికి కోడిపుంజును ఎన్నికల సంఘం కేటాయించింది.ప్రస్తుతం కూడ అన్నాడిఎంకెలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
కరుణానిధితో విబేధించి పార్టీని స్థాపించిన ఎంజీఆర్
అన్నాదురై స్థాపించిన డిఎంకెలో ఎంజీఆర్ కోశాధికారిగా ఉండేవారు. అయితే అప్పటికే పార్టీలో ఉన్న కరుణానిధి, ఎంజీఆర్ ఇద్దరూ కూడ మిత్రులుగానే ఉన్నారు.అయితే ఇదే సమయంలో కరుణానిధి, ఎంజీఆర్ మద్య విబేధాలు నెలకొన్నాయి. ఈ విబేధాల కారణంగా ఎంజీఆర్ డిఎంకెను వీడాల్సిన పరిస్థితులు వచ్చాయి.దీంతో ఆయన డిఎంకెను వీడారు. 1972 లో అన్నాడిఎంకెను ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి ఆయన మరణించేవరకు అంటే 1987 వరకు ఆయన పార్టీని ఇబ్బందులు లేకుండా నడిపించారు.
జయలలిత వర్గానిదే పై చేయి
1989లో తమిళనాడు రాష్ట్ర శాసనసభకు మద్యంతర ఎన్నికలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ ఎక్కువ స్థానాలను సాధించింది. జానకీ రామచంద్రన్ వర్గం అతి తక్కువ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.దీంతో ఈ ఎన్నికల్లో డిఎంకె రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. అయితే ఈ అసెంబ్లీలో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.జానకీ రామచంద్రన్ నేతృత్వంలోని పార్టీ ఎమ్మెల్యేలు , నాయకులు కూడ జయలలిత నేతృత్వంలోని పార్టీలో విలీనమయ్యారు.జానకీ రామచంద్రన్ ఎక్కువ కాలం పాటు తన వర్గాన్ని కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది.దీంతో జయలలితకు ఎదురు లేకుండా పోయింది.
ఎదురులేని జయలలిత
1989 లో డిఎంకె నేతృత్వంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది.అదే సమయంలో జయలలిత నేతృత్వంలోనే జానకీ రామచంద్రన్ వర్గీయులు కూడ విలీనమయ్యారు.ఎంజీఆర్ నడిపించిన దారిలోనే పార్టీని నడిపించారు జయలలిత.1991 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో డిఎంకె పరాజయం పాలైంది. అయితే 1991 ఎన్నికల వరకు ఆమె అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు.
పంథాను మార్చిన జయలలిత
2011 ఎన్నికల్లో పార్టీ మరోసారి విజయం సాధించారు.అయితే ఈ ఎన్నికల నాటి నుండి ఆమె సరికొత్త పంథాను అనుసరించారు. అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేశారు. దీంతో 2016 లో జరిగిన ఎన్నికల్లో కూడ అన్నాడిఎంకెకే మరోసారి ప్రజలు పట్టం కట్టారు. సంక్షేమ పథకాలే ఆమెను రెండోసారి వరుసగా అధికారంలోకి తీసుకువచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
.ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో దక్కని ఎన్నికల గుర్తు
జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకెలో సంక్షోభ పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం నేతృత్వంలో కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు చీలిపోయారు. రెండు వర్గాలు కూడ తమదే అసలైన అన్నాడిఎంకెగా చెప్పుకొంటున్నారు.అయితే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తును ఈసీ స్థంబింపజేసింది.దీంతో అన్నాడిఎంకె అమ్మ పేరుతో దినకరన్ బరిలోకి దిగారు.దినకరన్ టోపి గుర్తును ఎంచుకొన్నారు. పన్నీర్ సెల్వం గ్రూపు రెండు లైట్ల గుర్తును తీసుకొంది.
ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ
అన్నాడిఎంకె చీఫ్ ఎంజీఆర్ మరణించిన సమయంలో జానకీ రామచంద్రన్ వర్గం వైపే మెజారిటీ నాయకులున్నారు.జయలలిత వైపు ఒక్కరిద్దరూ మినహ ఎవరూ లేరు.అయితే ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గం వైపు తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.అయితే ఆనాడు జయలలిత ఎదుర్కొన్న పరిస్థితులను పన్నీర్ ఎదుర్కొంటున్నారు.అయితే జయలలిత తరహలో పన్నీర్ పై చేయి సాధిస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.