కిడ్నాప్ కేసులో కన్నడ నటుడు, నిర్మాత అరెస్టు
బెంగళూరు: కిర్లోస్కర్ కంపెనీ ఎండీ వినాయక్ బాపట్ కుమారుడు ఇషాన్ బాపట్ (19) కిడ్నాప్ కేసులో శ్యాండిల్ వుడ్ కు చెందిన ఓ నటుడితో పాటు ఐదు మందిని బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు.
కేఆర్ పురంలో నివాసం ఉంటున్న నటుడు, నిర్మాత మునియప్ప (28), హసన్ డంగ్రీ(26), జగదీష్ (32), జగన్నాథ్ (28), మనోజ్ (19) అనే నిందితులను అరెస్టు చేశామని బెంగళూరు నగర నార్త్-ఈస్ట్ డీసీపీ డాక్టర్ పీఎస్ హర్షా తెలిపారు.
ఈ కిడ్నాప్ గ్యాంగ్ కింగ్ పిన్ మునియప్ప చాలెంజర్ అనే కన్నడ సినిమాను నిర్మించాడని, ఆ సినిమాలో కీలక పాత్రలో అతనే నటించాడని డీసీపీ హర్షా చెప్పారు. నిందితులు ఓ వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ చేశారు.
కిల్లోస్కర్ ఎండీ వినాయక్ బాపట్ కుమారుడు నిషాన్ మీద వీరి కన్నుపడింది. యలహంక సమీపంలోని మీనాక్షి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న నిషాన్ దిన చర్యలను 15 రోజులు గమనించారు.
ఆగస్టు 23వ తేది సాయంత్రం యలహంక సమీపంలోని కూగిలు క్రాస్ దగ్గర బీఎంటీసీ బస్సు దిగిన నిషాన్ ను కిడ్నాప్ చేశారు. మరుసటి రోజు జాలహళ్ళి దగ్గర నిషాన్ ను వదిలి పరారైనారు. కిడ్నాపర్లను నిషాన్ గుర్తించాడని డీసీపీ హర్షా తెలిపారు.