హైదరాబద్: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటు చేసిన విందుకు హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మిస్సయ్యారు. అందుకు ఆమె కాస్తా విచారం వ్యక్తం చేశారు. ఆ విందుకు తనను ఆహ్వానించినా, హాజరుకాలేకపోయానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నది.
ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం మెల్బోర్న్లో ఉండడం వల్ల వీలుకాలేదని ట్విట్టర్లో తెలిపింది. ఒబామా గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు రాష్ట్రపతి నన్ను ఆహ్వానించడం తనకెంతో గౌరవమని, కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో హాజరుకాలేకపోతున్నానని విందుకు ముందు ట్వీట్ చేసింది.
ఇదిలావుంటే, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో సానియా మీర్జా, లియాండర్ పేస్ జోడీలు సోమవారంనాడు మిక్స్డ్ డబుల్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. టాప్ సీడ్ సానియా మీర్జా, ఆమె బ్రెజిల్ భాగస్వామి బ్రూనో సోరేస్ జోడీ అబిగైల్ స్పియర్స్, శాంటియాగో గొంజాలెజ్ జోడీని 7-5, 6-7 (3), 10-8 స్కోరుతో మట్టికరిపించింది.
కాగా, ఏడో సీడ్ పేస్, మార్టినా హింగిస్ జోడీ స్పానిష్ జోడీ అనాబెల్ మెడినా గారిగ్యూస్, పాబ్లో అండూజార్ జోడీని 6-3, 6-1 స్కోరుతో ఓడించింది.