రాహుల్గాంధీ అమేథీపై ప్లాన్: బీజేపీలోకి కాంగ్రెస్ ఎంపీ కొడుకు, ట్విస్ట్
లక్నో: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కమలం పార్టీని బలోపేతం చేసే విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీ ఇంచార్జిగా ఉన్న షా అక్కడ 73 స్థానాలు బీజేపీ గెలుచుకునేలా చేశారు. ఇప్పుడు అమిత్ షా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నియోజకవర్గాల పైన కూడా దృష్టి పెట్టారు.
అమేథీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సెట్ బ్యాక్! అమేథీ రాహుల్ గాంధీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చెందిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సిన్హ్ తనయుడు అనంత్ విక్రమ్ బీజేపీలో చేరనున్నారు. విక్రమ్ గురువారం తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటన చేశారు.
అనంత్ విక్రమ్ (27) డిసెంబర్ 21వ తేదీన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీకాంత్ బాజపాయి, లక్నో మేయర్ దినేష్ శర్మల సమక్షంలో ఆయన కమలం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకోనున్నారు. అంతకుముందు ఆయనతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ నేత సునీల్ బన్సాల్ తదితరులు అతనితో వరుసగా భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ మిగతా పార్టీల కంటే ప్రోయాక్టివ్ పార్టీ అని, తాను ఇటీవల ఆ పార్టీ నాయకులతో భేటీ అయ్యానని, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకుంటున్నానని ఆయన ఓ ఇంగ్లీషు మీడియాతో చెప్పారు.
అతను బీజేపీలో చేరనున్న నేపథ్యంలో ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారనే చర్చ సాగుతోంది. రాజకీయ అనుభవం అంతగా లేదు. అలాంటి వ్యక్తికి ముఖ్యమైన పదవి ఇస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, కాంగ్రెస్కు పట్టున్న, రాహుల్ గాంధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు బీజేపీ ఈయనను తురుపుముక్కగా ఉపయోగించుకుంటోందని అంటున్నారు.
కాగా, అనంత్ విక్రమ్ బీజేపీలో చేరినంత మాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నందున, ఆయన ఏదో ఆశించి చేరుతున్నారంటున్నారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, కాంగ్రెస్ పైన ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు.
యాదృచ్ఛికమేమంటే.. అనంత్ విక్రమ్ తండ్రి సంజయ్ సిన్హ్ 1998 - 2003 మధ్య బీజేపీలో చేరారు. 1998లో కాంగ్రెస్ నేత సతీష్ శర్మను అమేథి నుండి ఓడించారు. 1999లో సోనియా గాంధీ చేతిలో ఓడిపోయారు. 2003లో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో ఆయన సుల్తాన్పుర నియోజకవర్గం నుండి గెలుపొందారు. గత ఏడాది అస్సాం నుండి అతనిని రాజ్యసభకు పంపించారు.
కుటుంబ గొడవలు...
సంజయ్ సిన్హ్, అనంత్ విక్రమ్లు ఇటీవల అమేథీలోని ఫ్యామిలీ ప్రాపర్టీస్కు సంబంధించిన విషయంలో వార్తల్లోకి ఎక్కారు. ఇరువైపుల నుండి పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల మధ్య వచ్చిన ఆ గొడవలు.. ఇప్పుడు రాజకీయంలోకి కూడా చేరాయని అంటున్నారు. ఈ కారణంగా రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు అనంత్ విక్రమ్ బీజేపీలో చేరుతున్నారని అంటున్నారు.