ఆ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగుల నియామకం
ట్రంప్ ఎఫెక్ట్ తో ఒకవైపు వివిధ సాప్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన వ్యక్తమవుతుండగా, మరోవైపు కొన్ని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగుల నియామకం జరుపుతున్నాయి.
బెంగళూరు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో ఒకవైపు వివిధ సాప్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన వ్యక్తమవుతుండగా, మరోవైపు కొన్ని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల నియామకంపైన కూడా దృష్టిపెడుతున్నాయి.
బహుళ జాతి సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ సంస్థల్లో ఒకటైన ఎస్ఏపీ భారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ దాదాపు 2500 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
బెంగళూరు క్యాంపస్ లో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈ ఇంజనీర్ల నియామకాన్ని కంపెనీ చేపట్టబోతోంది. 50 మిలియన్ యూరోల పెట్టుబడులతో 5.15 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త క్యాంపస్ ను కంపెనీ ప్రారంభించింది.
గత రెండేళ్లుగా కూడా కంపెనీ ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తోంది. ప్రతీ ఏటా 1500 మంది ఇంజనీర్లను నియమించుకుంటూ వస్తోంది. గత రెండేళ్లుగా తమ నియామకాలు కాలేజీ క్యాంపస్ ల ద్వారానే జరిపామని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఖండెల్వాల్ చెప్పారు.
ఎస్ఏపీ ల్యాబ్స్ కు ఇండియాలో 10 వేలకు పైగా ఉద్యోగులున్నారని, వారిలో 7500 మంది ఇంజనీరింగ్ డివిజన్ లో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్ఏపీకి మొత్తం 85000 మంది ఉద్యోగులున్నారు.