శారదా స్కాం: టిఎంసి ఎంపి ముకుల్ రాయ్ని ప్రశ్నించిన సిబిఐ
న్యూఢిల్లీ: శారదా కుంభకోణం కేసులో తృణమూల్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు ముకుల్ రాయ్ని సిబిఐ ప్రశ్నించింది. శుక్రవారం సిబిఐ కార్యాలయంలో విచారణాధికారులు ఆయనను సుమారు ఐదు గంటలపాటు ప్రశ్నించారు.
శారదా కుంభకోణం కేసులో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణంపై ఆరా తీశారు. అనంతరం ముకుల్ మాట్లాడుతూ... తాను విచారణాధికారులకు పూర్తిగా సహకరించానని తెలిపారు. కేసులో వాస్తవాలు త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని తాను సీబీఐ అధికారులను కోరానని వెల్లడించారు. విచారణ కోసం అవసరమైతే తనను మళ్లీ పిలవొచ్చని సీబీఐ అధికారులకు తెలిపానన్నారు.
కాగా, 2011లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి శారదా కుంభకోణం టిఎంసిని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రమంత్రి మదన్ మిత్రా, ఇద్దరు పార్టీ ఎంపీలు కునాల్ ఘోష్, శృంజయ్ బోస్లు అరెస్టయ్యారు.
వేలకోట్ల రూపాయల శారదా స్కాంలో మరింత మందిని సిబిఐ విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇంకా చాలామంది నాయకులకు ఈ స్కాంతో సంబంధాలున్నాయనే కోణంలో సిబిఐ విచారిస్తోంది. కాగా, సిఎం మమతా బెనర్జీ మాత్రం తమ మంత్రులకు, ఎంపీలకు ఈ స్కాంతో సంబంధం లేదని వాదిస్తున్నారు.