అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ!: జయ అడుగుజాడల్లో..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న చర్చకు తెరపడింది. జయలలిత నెచ్చెలి శశికళకే పార్టీ బాధ్యతలను అప్పగించాలని అన్నాడీఎంకే నిర్ణయించింది.
పార్టీ బాధ్యతలన్నీ అప్పగిస్తూ అన్నాడీఎంకే ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. పోయెస్ గార్డెన్లో శశికళను కలిసిన అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరారు. జయ అడుగుజాడల్లో పార్టీని ముందుకు నడపాలని ఆమెను అభ్యర్థించారు.
Senior functionaries of AIADMK urge Thirumathi Sasikala to lead the party on the path shown by Puratchi Thalaivi Amma.
— AIADMK (@AIADMKOfficial) 10 December 2016
ఈ క్రమంలో శశికళనే పార్టీ బాధ్యతలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంపాటు జయలలిత కొనసాగిన ప్రధాన కార్యదర్శి పదవిలో ఇక శశికళ కొనసాగనున్నారు. ఎంజీఆర్ తర్వాత 30ఏళ్లపాటు జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు.
అయితే, ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే శశికళకు అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అప్పగించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, శశికళ మధ్య బేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో పార్టీ మనుగడ ఎలా ఉంటుందోనని పలువురు నేతలు మదనపడుతున్నట్లు సమాచారం.