పగ్గాలు అప్పగించిన వేళ.. శశికళ కంటతడి.. పోయెస్ గార్డెన్లో ఉద్వేగం
పార్టీ పగ్గాలు స్వీకరించాలన్న అన్నాడీఎంకె నేతల అభ్యర్థనతో తొలుత శశికళ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
చెన్నై: పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా అన్నాడీఎంకె ముఖ్య నేతలంతా పోయెస్ గార్డెన్ లోని చిన్నమ్మ శశికళ వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. పార్టీ పగ్గాలు స్వీకరించాలన్న అన్నాడీఎంకె నేతల అభ్యర్థనతో తొలుత శశికళ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో పోయెస్ గార్డెన్ లో వాతావరణం ఉద్వేగభరితంగా మారింది.
ఈ సందర్బంగా పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని సీఎం పన్నీర్ సెల్వం శశికళకు అందజేశారు. దీంతో ఉద్వేగానికి లోనైన శశికళ కంటతడి పెట్టుకున్నారు. అంతకుముందు పూలమాలతో అలకరించి ఉన్న జయలలిత చిత్రపటానికి చేతులు జోడించి నివాళులు అర్పించారు. కాగా, చిన్నమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
చిన్నమ్మ నాయకత్వాన్ని సమర్థిస్తూ పార్టీ నేతలంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ అధినేత్రిగా అన్నాడీఎంకెను ముందుండి నడిపించాల్సిందిగా కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమెకు అందజేశారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం తీర్మాన పత్రాలను తీసుకుని శశికళ ఆమె నివాసంలోకి వెళ్లిపోయారు.