పార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరు
శశికళను, దినకరన్లను పార్టీ పదవుల నుంచి తొలగించడం తమ తొలి విజయం అని మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అన్నారు. వీరిద్దరిని పదవుల నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.
చెన్నై: శశికళను, దినకరన్లను పార్టీ పదవుల నుంచి తొలగించడం తమ తొలి విజయం అని మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అన్నారు. వీరిద్దరిని పదవుల నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.
పళనిస్వామి మంచి నిర్ణయం
ఈ నేపథ్యంలో పన్నీరుసెల్వం మాట్లాడారు. తమ పోరాటం శశికళ కుటుంబానికి వ్యతిరేకమని పన్నీరు చెప్పారు. శశికళను, ఆమె కుటుంబాన్ని తప్పించడం ద్వారా పళనిస్వామి వర్గం మంచి నిర్ణయం తీసుకుందని కితాబిచ్చారు.
తొలి విజయం
వారి తొలగింపుతో తాము విజయం సాధించామని, కానీ పోరాటం మాత్రం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇప్పుడు తాము విలీనం అంశంపై చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
పన్నీరుసెల్వం భేటీ
మరోవైపు, పన్నీర్సెల్వం తన మద్దతుదారులతో బుధవారం సమావేశమయ్యారు. అన్నాడీఎంకేలో విలీనంపై శశికళ వర్గంతో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం విలీనంపై పన్నీర్సెల్వం కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
తగ్గిన దినకరన్
చిక్కుల్లో పడ్డ దినకరన్ ఓ మెట్టు దిగినట్లుగా కనిపిస్తోంది. అవసరమైతే పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని, అందరి ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన దినకరన్.. తాజాగా మరో కామెంట్ చేశారు. తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
పార్టీ ఆదేశాలు ధిక్కరించను
తాను పార్టీ ఆదేశాలు ధిక్కరించనని తేల్చి చెప్పారు. తనను పక్కన పెట్టినా బాధపడటం లేదన్నారు. అయితే పార్టీ ఒక్కటిగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. పార్టీ, ప్రభుత్వానికి దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.
పన్నీరు-పళని కలయికను వ్యతిరేకించను
తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. పార్టీకి మేలు చేసే నిర్ణయాలకు సహకరిస్తానని తెలిపారు. పన్నీరుసెల్వం, పళనిస్వామి కలయికను తాను వ్యతిరేకించనని చెప్పారు. తన వల్ల పార్టీ బలహీనపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. నిన్నటి నుంచి తాను పార్టీ కార్యకలాపాలకు దూరం జరిగానని తెలిపారు.
శశికళ మనస్తాపం
ఎన్నికల గుర్తు కోసం దినకరన్ రూ.60 కోట్లు ఇవ్వచూపారన్న ఆరోపణలతో శశికళ తీవ్ర మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. అందుకే దినకరన్ను కలుసుకునేందుకు అంగీకరింలేదని చెబుతున్నారు. తాజా పరిణామాలపై దినకరన్ కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు.