స్వయంకృతాపరాధమే ముంచింది: దినకరన్తో ములాఖత్ను చిన్నమ్మ ఎందుకు వద్దంది?
జైలుకు వెళ్లేముందు కూడా తమిళ రాజకీయాలను శాసిస్తానన్న ధీమా శశికళ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అంతే కసితో జయలలిత సమాధిపై ఆమె చేసిన శపథం.. జైల్లో ఉన్నా సరే శత్రువులను ఆమె వెంటాడుతారన్న సంకేతాలు పంపించిం
చెన్నై: జైలుకు వెళ్లేముందు కూడా తమిళ రాజకీయాలను శాసిస్తానన్న ధీమా శశికళ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అంతే కసితో జయలలిత సమాధిపై ఆమె చేసిన శపథం.. జైల్లో ఉన్నా సరే శత్రువులను ఆమె వెంటాడుతారన్న సంకేతాలు పంపించింది.
అందుకు తగ్గట్లే తన అనుయాయి పళనిస్వామికి పగ్గాలు అప్పజెప్పి.. ప్రభుత్వ పని తీరంతా తన కనుసన్నుల్లో జరిగేలా చేసింది. కానీ వ్యవహారమంతా ఎక్కడ దెబ్బకొట్టింది? శశికళ చేసుకున్న స్వయంకృతాపరాధమే ఈరోజు ఆమె కొంపముంచింది. ఏరికోరి మరీ మేనల్లుడు దికరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తే.. ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపి.. పార్టీలో ఇద్దరి చాప్టర్ క్లోజ్ అవడానికి కారణమయ్యాడు.
చిన్నమకే ఎసరు:
మేనల్లుడు, పార్టీని తనకు అనుకూలంగా నడిపించగలడన్న ధీమాతో దినకరన్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పితే.. చివరాఖరికి చిన్నమ్మకే ఎసరు పెట్టేశాడు. ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వడానికి సుఖేష్ తో నడిపిన బేరసారాలు బయటకు పొక్కడంతో.. చివరకు ఏం చేయాలో తెలియని స్థితిలో చిన్నమ్మనే ఆశ్రయించాలనుకున్నాడు.
ములాఖత్కు చిన్నమ్మ విముఖత:
కానీ చిన్నమ్మ మాత్రం దినకరన్ ను కలిసేందుకు విముఖత చూపించింది. శశికళను కలిసేందుకు సోమవారం ఉదయం బెంగుళూరు వెళ్లిన దినకరన్ కు.. మధ్యాహ్నాం 3గం.కు చిన్నమ్మతో ములాఖత్ కు జైలు అధికారులు ఓకె చెప్పారు. అయితే తాను 5.30గం.కు వస్తానని చెప్పడంతో.. జైలు అధికారులు అందుకు కూడా సరేనన్నారు.
తీరా సాయంత్రం 6.30గం. అయినా వీరిద్దరి మధ్య ములాఖత్ జరగలేదు. అయితే తమిళనాడు రిజిస్ట్రేషన్ తో కూడిన ఒక లగ్జరీ కారు జైలు వద్దకు వచ్చి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ కారులో దినకరన్ జైలు వద్దకు వచ్చినప్పటికీ.. ఆయనతో భేటీ అయేందుకు చిన్నమ్మ 'నో' చెప్పడంతో జైలు బయటినుంచే వెనుదిరిగినట్లు సమాచారం.
సుఖేష్ విచారణ వాయిదా:
ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చే వ్యవహారంలో దినకరన్ తరుపున బ్రోకర్ గా వ్యవహరించిన సుఖేష్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల పాటు కస్టడీలో ఉన్న అతన్ని ముందుగా విచారించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించుకున్నప్పటికీ మంగళవారం వారి చెన్నై ప్రయాణం అకస్మాత్తుగా రద్దయిపోయింది.
సఖేష్ పై చెన్నై, బెంగుళూరు, మధురై తదితర ప్రాంతాల్లో 19కేసులు ఉండటంతో తొలుత వాటి నుంచి వివరాలు రాబట్టిన తర్వాతే అతన్ని విచారించాలని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు సుఖేష్ ఎక్కడికి పారిపోయే వీలు కూడా లేకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
మరో ముగ్గురి అధికారుల ప్రమేయం:
ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చే వ్యవహారంలో సుఖేష్ తో పాటు కమిషన్ కార్యాలయంలోని ఒక అధికారి ద్వారా ఉన్నతాధికారిని మభ్యపెట్టే ప్రయత్నాలు సాగినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అధికారిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. మొత్తం వ్యవహారంలో సుఖేష్ తో పాటు మరో ముగ్గురి పాత్ర కూడా కీలకంగా ఉందని తేలడంతో.. వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు సమాచారం.
దినకరన్ ను పట్టే ఆధారాలు:
సుఖేష్ అనే పేరే తన జీవితంలో ఎన్నడూ వినలేదని దినకరన్ చెబుతున్నా.. తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చెబుతున్నారు. సరైన ఆధారాలు ఉన్నందునే దినకరన్ పై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశామన్నారు.
సుఖేష్-దినకరన్ మధ్య చాలాకాలంగా సంబంధాలున్నాయని, ఎన్నోసార్లు వీరిద్దరు కలుసుకున్నారని పోలీసులు తెలిపారు. ముందు నుంచి ఉన్న పరిచయంతోనే వీరిద్దరి మధ్య బేరసారాలు జరిగినట్లు తెలిపారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ కు చెందిన ఒక హవాలా ఏజెంట్ ద్వారా సుఖేష్ కు రూ.10కోట్లు ముట్టాయని చెప్పారు.
డబ్బు ముట్టిన తర్వాత వీరిద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారని, ఆ కాల్ వివరాలన్ని తమ వద్ద ఉన్నాయని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పష్టం చేశారు.