జైలులో శశికళ కోర్కెల చిట్టా: ఓ హోదాతో ఇవన్నీ...?
శశికళలో జైలులో తనకు కావాల్సిన సదుపాయాలపై కోర్కెల చిట్టా విప్పారు. ఆమె హోదాలో ఇవన్నీ అడుగుతున్నారనేది ఆశ్చర్యకరమే....
చైన్నై: జైలులో తనకు కల్పించాల్సిన సదుపాయాలపై అన్నాడియంకె చీఫ్ శశికళ నటరాజన్ కోర్కెల చిట్టా విప్పారు. ఆ కోర్కెల చిట్టా మామూలుగా లేదు. ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలుకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో జైలులో తనకు కావాల్సిన సదుపాయాలను ఆమె జైలర్కు తెలియజేసింది.
తనకు షుగర్ వ్యాధి ఉన్నందు వల్ల ఇంటిభోజనం ఇప్పించాలని కోరారు. దానికి తోడు మరిన్ని విన్నపాలు చేశారు. తనకు జైలులో ప్రత్యేక గది, మంచం, టీవీ కావాలని కోరారు. దానికితోడు ఓ సహాయకుడిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రోజూ మినరల్ వాటర్ ఇవ్వడంతో పాటు 24 గంటలూ వేడి నీళ్ల సదుపాయం కల్పించాలని శశికళ తన డిమాండ్లను తెలియజేశారు. అయితే శశికళ ఏ హోదాలో ఇన్ని డిమాండ్లు చేసిందని జైలు అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.
నిజానికి, ఆమెకు అన్నాడియంకె పార్టీ ప్రధాన కార్యదర్శి అనే పదవి తప్ప మరేమీ లేదు. ఈలోగానే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. ఆమెకు ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తారనేది చూడాల్సిందే. ఆమెను ఇంతకు ముందు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను ఉంచిన సెల్లోనే ఉంచుతారనే ప్రచారం సాగుతోంది.