అన్నాడీఎంకేపై బీజేపీ కుట్ర, శశికళ కాదు, పన్నీరే సీఎం: నటరాజన్ సంచలనం
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాషాయమయం చేసేందుకు, ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సోమవారం ఆయన తంజావూరులో ఆరోపించారు.
అయితే బీజేపీ ఆటలను సాగనివ్వబోమని ఆయన చెప్పారు. ప్రత్యర్థులు చెబుతున్నట్లుగా తాము కుటుంబ రాజకీయాలే చేస్తున్నామని, ఇందులో ఎలాంటి దాపరికాలూ లేవని తేల్చిచెప్పారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మృతి తర్వాత జయలలితను కంటికి రెప్పలా తమ కుటుంబ సభ్యులే కాపాడారని అన్నారు.
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సమర్థంగానే పనిచేస్తున్నారని, ఇప్పటికిప్పుడు ఆయనను మార్చే ఉద్దేశం తమకు లేదన్నారు. శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలా? వద్దా? అనేది శాసనసభ్యుల నిర్ణయం ప్రకారం ఉంటుందన్నారు. ప్రస్తుతానికైతే పన్నీర్ సెల్వంను మార్చే ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలను కలిసి కట్టుగా అడ్డుకోవాలని కార్యకర్తలు, నాయకులకు నటరాజన్ పిలుపునిచ్చారు.
ఓ వైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సమర్థంగానే పని చేస్తున్నారని, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితులు లేవన్నారు. అయితే శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా? వద్దా? అనే విషయంపై పార్టీ శాసనసభ్యులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని నటరాజన వ్యాఖ్యానించారు.
ఇది ఇలా ఉండగా, ఎంజీఆర్ తర్వాత పార్టీని బలోపేతం చేసి ప్రత్యర్థులను జీవచ్ఛవాలుగా మార్చిన అమ్మ జయలలిత మరణాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్న వారి కుట్రలను ఛేదిద్దామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇన్నాళ్లూ జీవచ్ఛవాలుగా మారిన వ్యతిరేకశక్తులు బలాన్ని కూడగట్టుకొని పుంజుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను కలసికట్టుగా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంజీఆర్ శతజయంతిని పురస్కరించుకుని శశికళ సోమవారం కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఎంజీఆర్ జయంతిని ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.