జైలు మార్పిడికి శశికళ ప్లాన్: హైకోర్టు కన్నా సుప్రీంకోర్టు బెటర్..
ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలవగా.. జైలు మార్పుకు సంబంధించిన పిటిషన్ తో హైకోర్టు కన్నా సుప్రీంను ఆశ్రయించడమే మేలు అని శశికళ భావిస్తున్నట్లుగా సమాచారం.
చెన్నై: మొత్తం మీద తాను జైలుకు వెళ్లినా సరే.. తన కనుసన్నుల్లోనే కొనసాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ సఫలమయ్యారు. అమ్మ సమాధి శపథం చేసి మరీ పన్నీర్ సెల్వంకు అధికారం దగ్గకుండా చేయడంలో ఆమె జాగ్రత్తపడ్డారు.
చివరికి పళనిస్వామికే పట్టం కట్టడంతో జైల్లో నుంచే తన వ్యూహాలకు పదునుపెట్టాలని భావిస్తున్నారు. నమ్మినబంటు పళనిస్వామి ద్వారా తన వ్యూహాలను అమలు చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బెంగుళూరు పరప్పన జైలు నుంచి తనను తమిళనాడుకు తరలించేలా ప్రయత్నాలు మొదలుపెట్టాలని శశికళ పార్టీ నేతలను కోరినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలవగా.. జైలు మార్పుకు సంబంధించిన పిటిషన్ తో హైకోర్టు కన్నా సుప్రీంను ఆశ్రయించడమే మేలు అని శశికళ భావిస్తున్నట్లుగా సమాచారం. సుప్రీం అయితేనే జైలు మార్పిడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, ఆరోగ్యంతో పాటు భద్రత కారణాలను కూడా పిటిషన్ లో ప్రస్తావిస్తూ వేలూరు లేదా చెన్నై జైలుకు మార్చాలని కోరనున్నట్లు సమాచారం అందుతోంది. నేడు లేదా రేపు ఈ పిటిషన్ సుప్రీంకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.